ఆపిల్‌కు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్‌

24 Nov, 2018 18:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మార్కెట్‌ క్యాప్‌లో ఆపిల్‌ను అధిగమించిన మైక్రోసాప్ట్‌

అమెరికాలో అతి విలువైన కంపెనీగా మైక్రోసాప్ట్‌

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ను మరో దిగ్గజం సంస్థ మైక్రోసాఫ్ట్‌  వెనక్కి నెట్టి ముందుకు దూసుకు వచ్చింది. మార్కెట్‌  క్యాప్‌కు సంబంధించిన మైక్రోసాఫ్ట్‌  అమెరికాలో నెం.1 కంపెనీగా స్థానాన్ని దక్కించుకుంది.  తద్వారా ఇటీవల జోరుమీదున్న ఆపిల్‌కు మైక్రోసాఫ్ట్‌ గట్టి షాక్‌ ఇచ్చింది.

నాలుగు నెలల క్రితం ఆపిల్‌ షేర్లు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఆగస్టులో 207 డాలర్ల మార్క్‌ను అందుకొని, దాన్ని సాధించిన తొలి ట్రిలియన్‌ డాలర్‌ కంపెనీగా అవతరించింది. అప్పటి నుంచి ఆపిల్‌ కొత్త రికార్డులను సాధించడం ప్రారంభించింది. ఏడు వారాల క్రితం 231 డాలర్ల షేర్‌ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఆపిల్‌ షేర్లు బిజినెస్‌ ఎనలిస్ట్‌లకు కూడా అర్థం కాని స్థితిలో నిలకడలేమితో కొనసాగుతున్నాయి. ఊహించని పరిణామాలు జరుగుతుండడంతో ఆపిల్‌లో ఇన్‌వెస్ట్‌ చేయడానికి  పెట్టుబడుదారులు సైతం వెనుకడుగు వేసే పరిస్థితి వచ్చింది. దీంతో  ఆపిల్‌ షేర్లు దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ సేల్స్‌లో బోల్తా పడ్డాయి. ఈ  పరిణామామే ఆపిల్‌ పతనానికి  కారణమని ట్రేడ్‌ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.  ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి ఆపిల్‌ షేర్లు 172.29 డాలర్లకు దిగజారాయి. కొద్ది వారాల సమయంలోనే ఆపిల్‌ షేర్లు 25 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. దీంతో ఆపిల్‌ ట్రిలియన్‌ డాలర్ల కంపెనీ అనేది చేదు కలగానే మిగిలిపోయింది. అంతేకాదదు ఆపిల్‌ మూలధనం (మార్కెట్‌ క్యాపిటల్‌) కూడా భారీ మార్పు చవిచూసింది. 

ఆపిల్‌ మూలధనం 746 బిలియన్‌ డాలర్లకు దిగి రాగా, 753 బిలియన్‌ డాలర్లతో మైక్రోసాఫ్ట్‌ ప్రపంచంలో అతిపెద్ద (మార్కెట్‌ క్యాప్‌లో)సంస్థగా నిలిచింది. అమెజాన్‌, గూగుల్‌ సంస్థలు ఆపిల్‌ కంటే కిందే ఉన్నప్పటికీ, ఆపిల్‌ షేర్లు ఇప్పటిలాగే పడిపోతుంటే రానున్న రోజుల్లో మరింత దిగజారే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు