అతి చౌక ధరలో ఐఫోన్ త్వరలో

11 Apr, 2020 12:14 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ: ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కొత్త, బడ్జెట్ ధర స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఐఫోన్ ఎస్ఈ2 (ఐఫోన్ 9) పేరుతో దీన్ని ఏప్రిల్ 15వ తేదీన విడుద‌ల చేసేందుకు యాపిల్ సిద్ధ‌ మ‌వుతున్న‌ట్లు తెలిసింది. అనుకున్నట్టు లాంచింగ్ పూర్తయితే,  ఏప్రిల్ 22 నుంచే వినియోగదారులకు  ఇది  లభ్యం కానుంది. 

ఈ ఫోన్ కోసం ఐఫోన్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ  కరోనా వైరస్ సంక్షోభంతో విడుదల వాయిదా పడింది. నిజానికి మార్చి 31వ తేదీనే మార్కెట్లో విడుదల కానుందని అంతా భావించినా,  కోవిడ్ -19 ఆందోళన నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది.  4.7, 5.5 అంగుళాల డిస్ ప్లే సైజుల్లో అతి చవక ధరలో ఐఫోన్ ప్రేమికులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఐఫోన్ ఎస్ఈ 2లో ఐఫోన్ 8 తరహాలోనే డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. తెలుపు, నలుపు, ఎరుపు మూడు రంగల్లో లాంచ్ కానున్న ఈ ఐఫోన్ లో 3డీ ట‌చ్‌ను జోడించిందట. అయితే ఫేస్ ఐడీ ఫీచ‌ర్‌ చేర్చలేదని సమాచారం. ఇక ధర విషయానికి వస్తే రూ.30 వేల లోపు ధ‌ర‌కే విక్ర‌యించాల‌ని అనుకుంటుంద‌ట‌. ఇందుకు గాను ఆయా దేశాల్లో ఉన్న త‌మ ఆథ‌రైజ్డ్ డీల‌ర్ల‌తో యాపిల్ ఇప్ప‌టికే సంప్రదింపులు పూర్తి చేసింది. అయితే ఈ విష‌యంపై స్ప‌ష్ట‌తకు మరో నాలుగురోజులు వేచి చూడ‌క తప్ప‌దు.

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ2 ఫీచర్ల అంచనాలు
4.7 అంగుళాల డిస్ ప్లే
13 బయోనిక్ ప్రాసెసర్ చిప్
3 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్ (బేసిక్) 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్
12 ఎంపీ కెమెరా
1960 ఎంఏహెచ్ బ్యాటరీ

చదవండి : అదే ఏకైక డిమాండ్ కావాలి - చిదంబరం

మరిన్ని వార్తలు