ఐఫోన్‌ ధరలు పెంచేసిన ఆపిల్‌

5 Feb, 2018 09:12 IST|Sakshi
భారత్‌లో విక్రయిస్తున్న ఐఫోన్లు(ఫైల్‌)

న్యూఢిల్లీ : బడ్జెట్‌-2018 ఎఫెక్ట్‌ ప్రారంభమైంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన దిగుమతి సుంకం పెంపు మేరకు, టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన అన్ని ఐఫోన్‌ మోడల్స్‌ ధరలను సగటున 3 శాతం మేర పెంచేసింది. ఒక్క ఐఫోన్‌ ఎస్‌ఈ మినహా మిగతా ఐఫోన్ల ధరలన్నీ పెరిగాయి. గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మొబైల్‌ ఫోన్లపై  దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం భారత్‌లోతన ఐఫోన్ల ధరలను  పెంచుతున్నట్టు ఆపిల్‌ ప్రకటించింది. ఈ పెంపుతో ఐఫోన్‌ ఎక్స్‌ 256జీబీ వేరియంట్‌ ధర రూ.3000 నుంచి రూ.3200 పెరిగింది. దీంతో అంతకముందు రూ.1,05,720గా ఉన్న ఈ ఫోన్‌ ధర ప్రస్తుతం, రూ.1,08,930గా అయింది.

ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6 ఎస్‌ ధరలు కూడా 1100 రూపాయలు, 1350 రూపాయల మేర పెరిగాయి. దీంతో ఐఫోన్‌ 6 ధర రూ.31,900గా, ఐఫోన్‌ 6ఎస్‌ ధర రూ.42,900గా మారింది. భారత్‌లో ప్రస్తుతం 16 మోడల్స్‌ను ఆపిల్‌ విక్రయిస్తోంది. ఆపిల్‌ కూడా ఈ ధరల మార్పును ధృవీకరించింది.  సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. తన వెబ్‌సైట్‌లో కూడా మారిన ధరలనే పొందుపరిచింది. దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని పెంచడం ఇది రెండోసారి. మేకిన్‌ ఇండియా ప్రొగ్రామ్‌ను ప్రోత్సహించడం కోసం దిగుమతి చేసుకునే ఫోన్లపై ప్రభుత్వం ఈ సుంకాన్ని పెంచుతూ వెళ్తోంది.  

>
మరిన్ని వార్తలు