మరోసారి ట్రెడిషన్‌ బ్రేక్‌ చేయనున్న జైట్లీ

31 Jan, 2018 17:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వ చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎప్పుడూ ఆంగ్లంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక శాఖ మంత్రి తొలిసారి రేపు హిందీలో బడ్జెట్‌  ప్రసంగం చేయనున్నారు. గ్రామీణ ప్రజలకు  చేరువయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పాత సాంప్రదాయానికి  గుడ్‌బై చెపుతూ  రేపటి బడ్జెట్‌ను  ఆర్థికమంత్రి హిందీలో చదవనున్నారు.    ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో  మొత్తం వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు  పెద్ద పీట వస్తున్న సందర్భంగా  గ్రామీణ ప్రజలకు, రైతులకు అర్థమయ్యే రీతిలో ఈసారి హిందీలో ప్రసంగించాలని అరుణ్‌ జైట్లీ ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో హిందీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తొలి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీనే కావడం విశేషం. ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌కు కావాల్సిన సన్నాహాలు పూర్తి చేసింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌  కావడం మరో విశేషం

యూనియన్‌  బడ్జెట్‌ అంటే.. అదో   బిగ్‌ డే.  ప్రతీ ఏటా కేంద్ర బడ్జెట్ వస్తోందని అనగానే సామన్యుడి నుంచి  ఎనలిస్టుల దాకా ..కార్పొరేట్‌ సెక్టార్‌  సహా దాదాపు అన్ని రంగాలు అలర్ట్ అయిపోతాయి.   రాయితీలు, ఊరటలు,  ఉపశమనాలు అంటూ  ప్రతీ రంగం ఎదురు చూస్తుంటుంది. తమకు  కావల్సిన సౌకర్యాలు, దక్కాల్సిన ఊరటలపై అనేక  అంచనాలు.. కోరికలను  వెల్లడించడం ఆనవాయితీ..మరోవైపు  ఆర్థిక రంగాన్ని ఇటు దేశ ప్రగతిని.. మరోవైపు రాజకీయ ప్రయోజనాలను.. ఇంకోవైపు ప్రజల సంక్షేమానికి సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసేందుకు అధికార కేంద్ర ప్రభుత్వం  కసరత్తు చేస్తుంది. ఇదులో తీపి కబుర్లు.... షాక్‌లు తగలడం కామన్‌.  ఈ నేపథ్యంలో బడ్జెట్‌ రూపకల్పన కత్తి మీద సామే.  అందులోనూ  వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు రానుండడంతో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్‌డీఐ సర్కార్‌కు  మరింత కీలకం. ఈ అంచనాల మధ్య కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2018-2019 ఆర్థిక సంవత్సరానికి గానూ పార్లమెంట్‌లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ఈ సందర్భంగా బడ్జెట్ గురించి ఇతర కొన్ని ఆసక్తికర విషయాలు

సంప్రదాయానికి విరుద్ధంగా బడ్జెట్‌ను నెలరోజుల ముందే ప్రవేశపెట్టడం.. 2017 నుంచి ప్రారంభించారు.   ఫిబ్రవరి 1న 2018 బడ్జెట్‌లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.   అలాగే రైల్వే బడ్జెట్‌తో యూనియన్‌ బడ్జెట్‌ను ప్రకటించడం ఇది రెండవ సారి. ఈ   సాంప్రదాయం గత ఏడాదే మొదలైంది.  2017లో రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో చేర్చారు. 92 ఏళ్లుగా వస్తున్న పార్లమెంట్ సాంప్రదాయానికి వీడ్కోలు చెప్పారు.

బడ్జెట్‌ను సాధారణంగా ఫిబ్రవరి నెల చివరి రోజున (పార్లమెంట్ పనిదినాల్లో) సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. కానీ వాజ్‌పేయి హయాంలో ఉదయం 11 గంటలనుండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఒకరోజు ముందు హల్వా వేడుక జరుగుతుంది. ఈ వేడుకల్లో ఆర్ధికమంత్రి స్వయంగా పాల్గొంటారు. బడ్జెట్ రూపకర్తలకు, సిబ్బందికి హల్వా పంచుతారు. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఒకరోజు ముందు నోరు తీపి చేసుకోవడం సంప్రదాయం.  బడ్జెట్ పత్రాలను బడ్జెట్‌కు వారం రోజుల ముందే ముద్రిస్తారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్, సెంట్రల్ సెక్రటేరియట్‌లో వీటిని ముద్రిస్తారు. హల్వా వేడుక తరువాత   బడ్జెట్‌ ప్రింటింగ్‌తో సంబంధం ఉన్న  ప్రతి అధికారి ఆ ప్రాంగంణం వదిలి బయటికి రావడానికి లేదు. కనీసం వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కూడా  దూరంగా ఉండాలి.  బడ్జెట్ సమర్పణ పూర్తయ్యేవరకు  ఇది కొనసాగుతోంది.  అయితే మాజీ కేబినెట్ కార్యదర్శి,  ప్రణాళికా సంఘ సభ్యుడు  బి.కె. చతుర్వేది  చెప్పినట్టుగా,  ప్రభుత్వం  ప్రతీదీ డిఫరెంట్‌గా  చేస్తోంది.  ఈ సారి లెదర్‌ బ్యాగ్‌ నుంచి హల్వాదాకా ప్రతిదీ అత్యంత రహస్యంగా  చక్కబెడుతోంది.

ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే 1969లో ప్రధాని ఇందిరా గాంధీ మహిళా ఆర్థికమంత్రి హోదాలో  తొలిసారి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు. దీంతో మహిళ ఆర్థికమంత్రిగా పనిచేసిన ఘనత ఆమెకే  దక్కుతుంది. ఇప్పటివరకు కేంద్ర  ఆర్థికమంత్రిగా ఇందిరా గాంధీ  తరువాత  ఇంకెవరూ ఈ పదవిని చేపట్టలేదు..బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు.

>
మరిన్ని వార్తలు