తిరిగి బాధ్యతల్లోకి జైట్లీ!

24 Aug, 2018 01:06 IST|Sakshi

ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా అరుణ్‌జైట్లీ తిరిగి గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు గంటపాటు నిర్వహించిన సమావేశంలో వ్యయ కార్యదర్శి ఏఎన్‌ ఝా, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్, కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 
దాదాపు 100 రోజుల తర్వాత... 
కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నేపథ్యంలో ఏప్రిల్‌ ప్రారంభం నుంచీ ఆయన ఆర్థికశాఖ కార్యాలయానికి రాలేదు. మే 14వ తేదీన 65 సంవత్సరాల జైట్లీకి ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ జరిగింది. అటు కొద్దిరోజుల తర్వాత అప్పుడప్పుడూ  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ట్వీట్స్‌ చేస్తున్నప్పటికీ, తాత్కాలికంగా ఆ బాధ్యతలను రైల్వే, బొగ్గు శాఖల మంత్రి పీయూష్‌ గోయెల్‌ నిర్వహించారు.  పోర్ట్‌ఫోలియో లేనప్పటికీ క్యాబినెట్‌ మంత్రిగానే ఆయన కొనసాగినందువల్ల,  ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టగానే జైట్లీ తిరిగి పదవీ ప్రమాణం చేయాల్సిన పని ఉండదు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు ఆర్థిక శాఖను జైట్లీకి కేటాయిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వు జారీ అయిందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఉదయం 11 గంటలకు సిబ్బందితో జైట్లీ వైట్‌ టాటా సఫారీలో  నార్త్‌బ్లాక్‌కు చేరుకున్నారు. సీనియర్‌ సహచరులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.      

మరిన్ని వార్తలు