ఈకామర్స్‌ సంస్థలకూ అసోసియేషన్‌ 

14 Mar, 2019 00:16 IST|Sakshi

ది ఈకామర్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

న్యూఢిల్లీ: దేశీ ఈకామర్స్‌ సంస్థలు తాజాగా ది ఈ–కామర్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (టీఈసీఐ) ఏర్పాటు చేసుకున్నాయి. స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, అర్బన్‌క్లాప్‌ తదితర సంస్థలు కలిసి దీన్ని నెలకొల్పాయి. అంతర్జాతీయ సంస్థలకు దీటుగా దేశీ సంస్థలు కూడా రాణించేందుకు, దేశీ ఈకామర్స్‌ రంగం వృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి తోడ్పడే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్నాప్‌డీల్‌ సీఈవో కునాల్‌ బెహల్‌ తెలిపారు. డేటా ప్రైవసీ, లాజిస్టిక్స్, పేమెంట్స్‌ తదితర అంశాలకు సంబంధించి భారతీయ ఈ–కామర్స్‌ రంగంలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు టీఈసీఐ ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు.

2017లో ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సాల్, ఓలా క్యాబ్స్‌ సహ వ్యవస్థాపకుడు భవిష్‌ అగర్వాల్‌ తదితరులు కలిసి ఇండియాటెక్‌ పేరుతో ఇటువంటిదే లాబీ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దేశీ స్టార్టప్స్‌కు సమాన అవకాశాలు కల్పించడం, ఐపీవో నిబంధనలను సరళతరం చేయడం, శక్తిమంతులైన ఇన్వెస్టర్ల నుంచి ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రయోజనాలు పరిరక్షించేలా డిఫరెన్షియల్‌ ఓటింగ్‌ విధానంలో మార్పులు తేవడం తదితర లక్ష్యాలతో ఇది ఏర్పాటైంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌ నుంచి బన్సాల్‌ నిష్క్రమణ అనంతరం దీని కార్యకలాపాలు నిల్చిపోయాయి. తాజాగా టీఈసీఐ ఆ లోటు భర్తీ చేయనుంది.    

మరిన్ని వార్తలు