విమాన చార్జీలకు రెక్కలు..

23 May, 2018 16:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‍సాక్షి, ముంబయి : ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ ధరలు గత ఏడాదిలో 30 శాతం పెరగడంతో విమానయాన సంస్థలు నిర్వహణ ఖర్చులను అధిగమించేందుకు విమాన చార్జీలను పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 45 శాతం జెట్‌ ఇంధనం ఖర్చులే కావడంతో విమాన చార్జీలను 15 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో చార్జీలు పెంచకతప్పదని ఇప్పటికే పలు ప్రైవేట్‌ విమానయాన సంస్థలు సంకేతాలు పంపినా అధికారికంగా చార్జీల పెంపుపై స్పష్టత ఇవ్వలేదు.

గత ఏడాదిగా జెట్‌ ఇంధన ధరలు 30 శాతం మేర పెరిగాయని, గత ఆరునెలల్లోనే 25 శాతం భారమయ్యాయని, ఈ పరిస్థితుల్లో టికెట్‌ ధరలను పెంచకతప్పదని ఓ ప్రైవేట్‌ విమానయాన సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయితే ముందుగా ఏ సంస్థ చార్జీల పెంపును ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు పోటీ పెరిగిన క్రమంలో చార్జీల పెంపుకు ముందు సీట్ల ఆక్యుపెన్సీని కూడా చూసుకోవాలని మరో ఎయిర్‌లైన్‌కు చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పేర్కొన్నారు. జెట్‌ ఇంధన ధరల పెంపుతో విమాన చార్జీలు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని తాము అంచనా వేస్తున్నామని కేపీఎంజీ ఏరోస్సేస్‌, డిఫెన్స్‌ ఇండియా హెడ్‌ అంబర్‌ దూబే పేర్కొన్నారు. జెట్‌ ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తే పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని అన్నారు. 

మరిన్ని వార్తలు