అరబిందో లాభం 45% జంప్‌

4 Jun, 2020 07:04 IST|Sakshi

క్యూ4 నికరలాభం రూ.850 కోట్లు

టర్నోవర్‌ రూ.6,158 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మార్చి త్రైమాసికంలో అరబిందో ఫార్మా ఉత్తమ పనితీరు కనబరిచింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 45.2% వృద్ధితో రూ.850 కోట్లకు చేరింది. టర్నోవర్‌ 16.4% వృద్ధితో రూ.5,292 కోట్ల నుంచి రూ.6,158 కోట్లకు ఎగసింది. యూఎస్‌ ఫార్ములేషన్‌ అమ్మకాలు 20.5% పెరిగి రూ.2,990 కోట్లు, యూరప్‌ ఫార్ములేషన్‌ విక్రయాలు 26% హెచ్చి రూ.1,652 కోట్లు, వృద్ధి మార్కెట్లు 30% పెరిగి రూ.376 కోట్లు సాధించాయి. ఏపీఐల అమ్మకాలు రూ.917 కోట్ల నుంచి రూ.755 కోట్లకు దిగొ చ్చాయి. పరిశోధన, అభివృద్ధికి రూ.239 కోట్లు వ్యయం చేశారు. ఏఎన్‌డీఏల విషయంలో యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఈ త్రైమాసికంలో ఆరు తుది, రెండు తాత్కాలిక అనుమతులను కంపెనీ దక్కించుకుంది.

టర్నోవర్‌ రూ.23 వేల కోట్లు..
2019–20 ఆర్థిక సంవత్సరంలో అరబిందో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19.7% పెరిగి రూ.2,831 కోట్లు సాధించింది. టర్నోవర్‌ 18 శాతం అధికమై రూ.23,098 కోట్లకు ఎగసింది. ఈపీఎస్‌ రూ.48.32 నమోదైంది. యూఎస్‌ ఫార్ములేషన్‌ అమ్మకాలు 27% హెచ్చి రూ.11,483 కోట్లు, యూరప్‌ ఫార్ములేషన్‌ విక్రయాలు 19.4% పెరిగి రూ.5,922 కోట్లు, వృద్ధి మార్కెట్లు 13.5% అధికమై రూ.1,355 కోట్లు నమోదయ్యాయి. పరిశోధన, అభివృద్ధికి ఆదాయంలో 4.1% (రూ.958 కోట్లు) వెచ్చించారు. విభిన్న ఉత్పత్తుల కారణంగా యూఎస్‌ఏ, యూరప్‌ మార్కెట్లలో వృద్ధిని కొనసాగించామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత వ్యాపారాలను పటిష్టం చేయడం, వినూత్న, ప్రత్యేక ఉత్పత్తుల అభివృద్ధి, నిబంధనలకు లోబడి పనిచేయడంపై దృష్టిసారించామని చెప్పారు.

మరిన్ని వార్తలు