కొనుగోలు వార్తలతో ‘యాక్సిస్‌’ జోరు

22 Feb, 2017 01:31 IST|Sakshi

యాక్సిస్‌ బ్యాంక్‌ కోసం పలు ప్రైవేటు రంగ బ్యాంకులు పోటీపడుతున్నాయన్న వార్తలతో మంగళవారం ఈ బ్యాంక్‌ షేరు భారీగా పెరిగింది. యాక్సిస్‌ను విలీనం చేసుకునేందుకు కోటక్‌  మహీంద్రా బ్యాంక్‌ ప్రభుత్వాన్ని సంప్రదించిందని, యాక్సిస్‌ వాటాను కొనుగోలుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇంద్‌ బ్యాంక్‌లు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించాయనే వార్తలు కొన్ని ఛానళ్లలో ప్రసారమయ్యాయి. దాంతో ఈ షేర్‌ 5 శాతం లాభంతో రూ.505 వద్ద ముగిసింది. కొటక్‌ బ్యాంక్‌తో విలీనమేదీ లేదని సోమవారం యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించినప్పటికీ, మీడియాలో పదేపదే వార్తలు వెలువడుతుండటంతో బ్యాంక్‌ షేరు హఠాత్‌ ర్యాలీ జరిపింది.

అలాంటిదేమీ లేదు..: కేంద్రం
యాక్సిస్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకునేందుకు, అందులో వాటా కొనుగోలుకు ఏ బ్యాంకూ తమవద్దకు ప్రతిపాదన తీసుకురాలేదని కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం రాత్రి చెప్పారు. ఈ బ్యాంక్‌లో 12% వాటా ప్రభుత్వం వద్ద వుంది. ఆ వాటాను విక్రయించాలన్న ఉద్దేశ్యం కూడా ప్రభుత్వానికి వుంది. అయితే తక్షణమే ఈ వాటాను విక్రయించే అవకాశం లేదని ఆ అధికారి స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు