దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

18 Jul, 2019 04:54 IST|Sakshi

టెక్నాలజీ సంస్థ ఐసెర్టిస్‌లో పెట్టుబడులు

బిలియన్‌ డాలర్లకు సంస్థ విలువ

బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ తోడ్పాటుతో ఒక స్టార్టప్‌ సంస్థ బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ స్థాయికి చేరింది. క్లౌడ్‌ ఆధారిత కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే ఐసెర్టిస్‌ సంస్థలో అజీం ప్రేమ్‌జీ కుటుంబానికి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ ఫండ్, గ్రేక్రాఫ్ట్‌ పార్ట్‌నర్స్‌ తదితర సంస్థలు 115 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన బి క్యాపిటల్‌ గ్రూప్, ఎయిట్‌ రోడ్స్‌ మొదలైనవి కూడా ఉన్నాయి. తాజా పెట్టుబడులతో ఐసెర్టిస్‌  సంస్థ మొత్తం 211 మిలియన్‌ డాలర్లు సమీకరించినట్లయింది. ఈ విడత నిధుల సమీకరణతో సంస్థ విలువ 1 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరినట్లవుతుందని ఐసెర్టిస్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్‌ బోదాస్‌ తెలిపారు.

నెలకొల్పింది మనోళ్లే..
2009లో సమీర్, ఆయన మిత్రుడు మనీష్‌ దర్దా కలిసి ఐసెర్టిస్‌ను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో 850 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 600 మంది పుణే కేంద్రంలో పనిచేస్తున్నారు. సరుకుల కొనుగోళ్ల నుంచి ఉద్యోగులతో ఒప్పందాలు దాకా ప్రపంచవ్యాప్తంగా పలువురు క్లయింట్లకు 57 లక్షల పైగా కాంట్రాక్టుల నిర్వహణకు సేవలు అందిస్తున్నట్లు సమీర్‌ వివరించారు. వీటి మొత్తం విలువ 1 లక్ష కోట్ల డాలర్ల పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవలపై కంపెనీలు 2018–2022 మధ్య కాలంలో దాదాపు 20 బిలియన్‌ డాలర్ల దాకా వెచ్చించనున్నట్లు పరిశ్రమవర్గాల అంచనా.

మరిన్ని వార్తలు