నూడుల్స్‌..బిస్కట్స్‌..ఇక సోలార్‌ పవర్‌

5 Dec, 2017 16:08 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్‌ మరో కీలకమైన వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. పతంజలి ఉత్పత్తులతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలకు సైతం గుండెల్లో గుబులు పుట్టించిన  రాందేవ్‌ తాజాగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంపై దృష్టిపెట్టారు. ఇపుడిక చైనా సోలార్‌ ఉత్పత్తుల సంస్థకు చెక్‌ పెట్టేలా సోలార్‌  విద్యుత్తు వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.  ప్రతీ ఇంటికి  సోలార్‌విద్యుత్‌ లక్ష్యంగా భారీ పెట్టుబడితో  సోలార్‌ కరెంట్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.

స్వదేశీ ఉద్యమానికి అనుగుణంగా సోలార్‌పవర్‌ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తున్నామని పతంజలి  మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ  తెలిపారు. తద్వారా భారతదేశంలో ప్రతి ఇంటికి సోలార్‌విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేస్తున్నామన్నారు. నాణ్యతలో రాజీపడకుండా  భారతదేశంలో సౌర ఫలకాలను తయారు చేస్తాము. కానీ చైనీస్ సోలార్ ప్యానెల్‌  ధరల యుద్ధంలోకి  రామని ఆయన చెప్పారు.  డిమాండ్‌ కనుగుణంగా   వ్యాపార విస్తరణను పరిశీలిస్తామని బాలకృష్ణ చెప్పారు.

ఈ మేరకు ఈ ఏడాది  ప్రారంభంలో అడ్వాన్స్ నావిగేషన్ అండ్ సోలార్ టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకుంది.  రూ .100 కోట్ల పెట్టుబడితో  గ్రేటర్ నోయిడాలోని కర్మాగారాన్ని  20 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో   నెలకొల్పనుంది. తదుపరి రెండు నెలల వ్యవధిలో పూర్తిస్థాయిలో  అందుబాటులోకి  రానుంది.
 

మరిన్ని వార్తలు