నిఫ్టీని నడిపించిన అంశాలివే..!
మార్చి 24న నిఫ్టీ కనిష్టం 7,511
జూన్ 3కల్లా 10వేల ముగింపు
నిఫ్టీ ర్యాలీకి మద్దతిచ్చిన ఇండెక్స్ షేర్లు
కరోనా భయాలు, ఆర్థిక వృద్ధి మందగమనంతో నిఫ్టీ ఇండెక్స్ మార్చి 24న 7,511 ఏడాది కనిష్టాన్ని తాకింది. కేవలం 46 ట్రేడింగ్ సెషన్లలోనే ఇండెక్స్ 10వేల మార్కును అందుకుంది. ఈ క్రమంలో నిఫ్టీ ప్రయాణం అనుకున్నంత సులువుగా జరగలేదు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఈ మార్చి 24వ తేది నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు వ్యాపారాలు, సాధారణ జీవితంలోనూ అతిపెద్ద అంతరాయాన్ని కలిగించింది. ఈ కాలంలో దేశీయ స్టాక్స్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. మురోవైపు అమెరికా చైనాల మధ్య ఉద్రిక్తతలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు క్రమంగా పెట్టుబడులను విక్రయించడం, క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు దేశీయ మార్కెట్ అస్థిరతను మరింత పెంచాయి.
వాల్యూయేషన్ పరంగా నిఫ్టీ తన లాంగ్టర్మ్ మూవింగ్ యావరేజ్తో పోలిస్తే తక్కువగా ఉంది. నిఫ్టీ ఇండెక్స్ బుధవారం తన ఐదేళ్ల యావరేజ్ 24.72తో పోలిస్తే పీఈ విలువ 23.31 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఈ 46 ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ-50 ఇండెక్స్లోని ఎంఅండ్ఎం, సిప్లా షేర్లు వరుసగా 72శాతం, 69శాతం ర్యాలీచేశాయి. జీఎంటర్టైన్మెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యూపీఎల్, హిందాల్కో, భారతీ ఇన్ఫ్రాటెల్, వేదాంత లిమిటెడ్ షేర్లు 50-70శాతం పెరిగాయి. గ్రాసీం, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, బజాజ్ అటో, హీరోమోటర్స్ క్యాప్, సన్ఫార్మా, టాటామోటర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, ఐటీసీ షేర్లు 30-50శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ర్యాలీకి ఇండెక్స్ కాంపోనెంట్స్ మంచి సహకారాన్ని అందించాయి.
ఎస్బీఐ ర్యాలీ అంతంతగానే:
ఎస్బీఐ షేరు మాత్రం ఇండెక్స్ ర్యాలీకి ఏ మాత్రం మద్దతునివ్వలేదు. ప్రభుత్వరంగానికి చెందిన ఈ ఇండెక్స్ మార్చి 24 కనిష్టం నుంచి ఇప్పటికీ 5శాతం దిగువునే ఉండటం విశేషం. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నాము. ధరతో నిమిత్తం లేకుండా ఎస్బీఐ షేరు పట్ల బుల్లిష్గా ఉన్నాము. వ్యయాలు, ఆస్తుల నాణ్యత, నిర్వహణ లాంటి అంశాల్లో ఇతరుల బ్యాంకుల కన్నా ఉన్నతమైన స్థానంలో ఉంది.’’ అని షేర్ఖాన్ డిప్యూటీ వైస్ప్రెసిడెంట్ లలితాబ్ శ్రీవాత్సవ్ తెలిపారు. ఇప్పుడు మార్కెట్ దృష్టి ఎస్బీఐ మార్చి క్వార్టర్ ఫలితాలను పడింది. జూన్5న బ్యాంక్ క్యూ4 ఫలితాలను విడుదల చేయనుంది. నికరవడ్డీ ఆదాయం 16శాతం, ప్రీ-ప్రోవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 34శాతం వృద్ధిని సాధించవచ్చని అంచనా శ్రీవాత్సవ్ వేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురవుతున్న ప్రతికూలతల పరిస్థితులను మార్కెట్ పూర్తిగా విస్మరించి ర్యాలీ చేస్తుందని నిపుణులు అంటున్నారు. వినియోగం, పెట్టుబడులు భారీగా క్షీణించడంతో ఈ జనవరి-మార్చి త్రైమాసింకలో ఇండియా ఆర్థిక వృద్ధి నెమ్మదించి 3.1శాతంగానూ, పూర్తి ఆర్థిక సంవత్సరం 2019-20లో 4.2శాతంగా నమోదై 11ఏళ్ల కనిష్టానికి దిగివచ్చింది.
నోమురా రేటింగ్ ఇలా...
జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా దేశీయ సైకిలికల్స్, ఫైనాన్స్, అటో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వినియోగరంగాలకు చెందిన షేర్లకు అండర్వెయిట్ రేటింగ్ను, ఎగుమతి రంగాలకు చెందిన హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు చెందిన షేర్లకు ఓవర్వెయింట్ రేటింగ్ను కేటాయించింది. ఎంఅండ్ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, లుపిన్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లను వాచ్లిస్ట్ రేటింగ్నిచ్చింది.
ఎఫ్పీఐ కొనుగోళ్లు:-
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం పెరిగి ప్రస్తుత ర్యాలీకి తన వంతు సాయం చేస్తుంది. ఎఫ్పీఐలు 2నెలల అమ్మకాల పరంపరను నిలిపివేసి ఈ మేనెలలో రూ.14,569 కోట్లను, జూన్లో గత 2 ట్రేడింగ్ సెషన్లో రూ.8,138 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
ఆశావహన అంచనాలు అవసరం: అన్షుల్ సైఘల్
స్వల్పకాలంలో అనిశ్చితులు ఎదురుకావచ్చు. కరోనావైరస్ సంక్షోభం ఎలా తొలగిపోతుందో మనం చూడాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య సమిష్టి ప్రయత్నం ఉందని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని విషయాలు తిరిగి ట్రాక్లోకి వస్తాయని ఆశావహన అంచనాలను కలిగి ఉండాలి.’’ అని కోటక్ మహీంద్రా ఏఎంసీ పోర్ట్ఫోలియో మేనేజర్ అన్షుల్ సైఘల్ తెలిపారు.