బజాజ్‌ ‘క్యూటీ’ కమింగ్‌ : చిన్నకార్లకు దెబ్బే

24 Nov, 2018 20:30 IST|Sakshi

సాక్షి, ముంబై: ఎంట్రీ లెవల్‌ కారుకోసం ఎదురు చూస్తున్న  భారత వినియోగదారులకు శుభవార్త. వాణిజ్య అవసరాలకే వాడుతున్న క్వాడ్రిక్‌ సైకిళ్లను ఇకపై వ్యక్తిగత అవసరాలకు  కూడా వినియోగించుకో వచ్చని నవంబరు 20న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ  ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఈ నేపథ్యంలో టాటా నానో కారు తరహాలో  ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో తన చిన్నకారును  ఇండియన్‌ మార్కెట్లో ప్రవేశపెటేందుకు  సిద్ధమవుతోంది. ‘క్యూటీ’ పేరుతో క్వాడ్రిక్‌ సైకిల్‌ను ఫిబ్రవరి 2019లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం.

బజాజ్‌  క్యూటీ ధర సుమారు రూ.2.60లక్షల నుంచి రూ.3లక్షల వరకూ ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు అధిక మైలేజీని ఇవ్వడంతో పాటు, కాలుష్య ఉద్గారాలను తక్కువ వెలువరిస్తుందట. లీటరు కు 30కి.మీ. పైనే మేలేజీ, గంటకు 70కి.మీ. వేగంతో ప్రయాణించగలదని అంచనా.  

భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నగరాలకు ఈ క్యూటీ అనువుగా ఉండనుంది.  ప్రస్తుతం క్యూటీని కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే విక్రయిస్తున్నారు. కాగా, ఇటీవల ప్రభుత్వం వ్యక్తిగత అవకాశాలకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చంటూ నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రయాణ వాహన రంగంలో పెను మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ  క్రమంలో టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎండ్‌ మరో రెండు సంవత్సరాల్లో  తమ సరికొత్త వాహనాలను లాంచ్‌ చేసే  అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. అలాగే మారుతి, హ్యుందాయ్‌  తమ  వ్యూహాలను మార్చుకొని అతి తక్కువ ధరలో ఎంట్రీ లెవల్‌ కార్లను లాంచ్‌ చేస్తాయని  పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ మాట్లాడుతూ.. పట్టణాల్లో ప్రయాణాలకు క్యూటీ చక్కగా సరిపోతుంది. ద్విచక్రవాహనంతో పోలిస్తే, భద్రత విషయంలోనూ మంచి ప్రమాణాలను పాటించాం. టూ-వీలర్‌కు ఎంతైతే నిర్వహణ ఖర్చు అవుతుందో దీనికి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంతేకాదు, అధిక మైలేజీని ఇవ్వడంతో పాటు, కాలుష్య ఉద్గారాలను సైతం తక్కువగా వెలువరిస్తుందని వెల్లవడించారు. 

కాగా యూరప్‌, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల్లో క్వాడ్రిక్‌ సైకిల్‌ విక్రయిస్తున్న బజాజ్‌ ఆటోక్యూటీని తొలిసారి 2012లో ఆవిష్కరించింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా రోడ్డువాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి భారత్‌లో అనుమతి లభించలేదు.

మరిన్ని వార్తలు