-

48 శాతం పెరిగిన బంధన్‌ బ్యాంక్‌ లాభం 

19 Jul, 2018 01:23 IST|Sakshi

క్యూ1లో రూ.482 కోట్లు

కోల్‌కతా: ప్రైవేట్‌ రంగంలోని బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 48 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.327 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.482 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, రుణ నాణ్యత స్థిరంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించినట్లు బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ చంద్ర శేఖర్‌ ఘోష్‌ చెప్పారు. నికర వడ్డీ ఆదాయం రూ.743 కోట్ల నుంచి 40 శాతం వృద్ధితో రూ.1,037 కోట్లకు పెరిగిందని, ఇతర ఆదాయం 73 శాతం పెరిగి రూ.211 కోట్లకు చేరిందని వివరించారు.  

10.27%కి తగ్గిన నికర వడ్డీ మార్జిన్‌... 
స్థూల మొండి బకాయిలు ఎలాంటి మార్పు లేకుండా 1.26%గా ఉన్నాయని, నికర మొండి బకాయిలు మాత్రం 0.56% నుంచి 0.64%కి పెరిగాయని చంద్రశేఖర్‌ ఘోష్‌ చెప్పారు. మొండి బకాయిలకు కేటాయింపులు మాత్రం రూ.556 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెరిగాయన్నారు. ‘‘నికర వడ్డీ మార్జిన్‌ 10.75 శాతం నుంచి 10.27%కి తగ్గింది. కాసా నిష్పత్తి 26.33% నుంచి 35.46%కి పెరిగింది. రుణాలు 52% ఎగిశాయి. మొత్తం రుణాల్లో 85% వరకూ సూక్ష్మ రుణాలే. ఇక డిపాజిట్‌లు ఈ ఏడాది జూన్‌ 30కి రూ.30,703 కోట్లకు పెరిగాయి. వీటిలో రిటైల్‌ డిపాజిట్లే 80%. మిగిలినవి బల్క్‌ డిపాజిట్లు’’ అని ఘోష్‌ వివరించారు.
 
వచ్చే మార్చినాటికి వెయ్యి బ్రాంచీలు..
ప్రస్తుతం 937గా ఉన్న బ్యాంక్‌ బ్రాంచీల సంఖ్యను వచ్చే ఏడాది మార్చి నాటికి వెయ్యికి పెంచనున్నామని తెలియజేశారు. ఫలితాలు బాగుండటంతో బంధన్‌ బ్యాంక్‌ షేర్‌ ఇంట్రాడే లో ఆల్‌టైమ్‌ హై రూ.608ను తాకింది. చివరకు 6.7% లాభంతో రూ. 600 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు