వేతన చెల్లింపుల్లో ఈ నగరమే టాప్‌..

16 Apr, 2018 17:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత ఐటీ క్యాపిటల్‌గా పేరొందిన బెంగళూర్‌ అత్యధిక వార్షిక వేతనాలను ఆఫర్‌ చేయడంలో దేశంలోనే అగ్రస్ధానంలో నిలిచింది. అన్ని రంగాల్లోని వివిధ స్థాయిల ఉద్యోగులకు సగటున రూ 10.8 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తూ ముందువరుసలో నిలిచింది.  ఇక పూణే రూ 10.3 లక్షల వార్షిక వేతనంతో రెండవ స్థానంలో నిలవగా, జాతీయ రాజధాని ప్రాంతం, ముంబయిలు రూ 9.9 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తూ తర్వాతి స్ధానాలను దక్కించుకున్నాయి. చెన్నైలో ప్రొఫెషనల్స్‌కు రూ 8 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తుండగా, హైదరాబాద్‌లో ప్రొఫెషనల్స్‌కు రూ 7.9 లక్షల వార్షిక వేతనం దక్కుతోంది.

దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన కోల్‌కతాలో వృత్తినిపుణులకు సగటున ఏటా రూ 7.2 లక్షల వేతనం లభిస్తోంది. ​ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాల్లో నైపుణ్యాలకు అధిక వేతనాలు దక్కుతున్నట్టు వెల్లడైంది. దాదాపు 20 పరిశ్రమల్లోని విభాగాలు, 15 క్యాటగిరీలకు చెందిన లక్ష ఉద్యోగాలను విశ్లేషించి రూపొందించిన రాండ్‌స్టాడ్‌ ఇన్‌సైట్‌ వేతన ధోరణులు-2018 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఫార్మా, హెల్త్‌కేర్‌ పరిశ్రమకు చెందిన ప్రొఫెషనల్స్‌ అత్యధిక వేతనాలు పొందుతున్నట్టు తెలిపింది. ఈ రంగంలోని వృత్తినిపుణులు సగటున అత్యధికంగా రూ 9.6 లక్షల వార్షిక వేతనం పొందుతున్నారు. వైద్య నిపుణులకు అత్యధిక వేతనాలు లభిస్తుండగా, జీఎస్‌టీ రాకతో సీఏలు, ఆడిటింగ్‌ నిపుణులకూ రూ 9.4 లక్షల వార్షిక వేతనం సగటున లభిస్తోంది. వైద్యం తర్వాత మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌, అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ నిపుణులు తర్వాతి స్ధానంలో నిలుస్తుండగా, ఐటీ రంగ నిపుణులకు సగటున రూ 9.1 లక్షల వార్షిక వేతనం దక్కుతోంది. మౌలిక, నిర్మాణ రంగాలు ఈ జాబితాలో వరుసగా నాలుగు, ఐదు స్ధానాల్లో నిలిచాయి. 

మరిన్ని వార్తలు