క్యాబ్‌కు సెలవు

21 Aug, 2018 11:55 IST|Sakshi

బెంగళూరులోఖరీదైన ట్యాక్సీ ప్రయాణం  

రెట్టింపైన చార్జీలతో ప్రజలు బెంబేలు  

ప్రత్యామ్నాయాలవైపు చూపు

సాక్షి బెంగళూరు: ఐటీ సిటీలో ప్రయాణం చేయాల్సి వస్తే క్యాబ్‌ను యాప్‌లో బుక్‌ చేసుకోవడం క్రమంగా తగ్గుతోంది. రవాణా శాఖ ఇటీవల క్యాబ్‌ రేట్లను పెంచడంతో ప్రజలు క్యాబ్‌ ట్యాక్సీల సేవలకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఓలా, ఉబర్‌ తదితర క్యాబ్‌లను మొబైల్‌ యాప్‌ ద్వారా తొందరగా బుక్‌ చేసుకుని ప్రయాణించడం అందరికీ సులువుగానే ఉంటోంది. కానీ వాటి చార్జీలు భగ్గుమంటుండడంతో జనం పొదుపుగా ఉండే రవాణా సాధనాలపై దృష్టి సారిస్తున్నారు. సొంత వాహనాల్లోను, ఆటోలు, బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణాలకూ వెనుకాడడం లేదు. ఓలా, ఉబర్‌ క్యాబ్‌లు గతంలో తక్కువ రేట్లకే ప్రయాణం చేసేలా ఆఫర్లు ప్రకటించాయి. దీంతో ప్రజలు క్యాబ్‌ల్లో ప్రయాణించేందుకు అలవాటు పడ్డారు. ఒక్కరే వెళ్లడానికి కూడా తక్కువ ధరలు కావడంతో అందరు ఆసక్తి చూపారు. కొత్తగా రేట్లు పెరగడంతో వినియోగదారులు ఒకటికిరెండు సార్లు ఆలోచిస్తున్నారు. గత్యంతరం లేనిపక్షంలోనే క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.  

కొత్త చార్జీలు ఇలా  
ఈ ఏడాది మార్చి 3న రేట్లను సవరిస్తున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది. క్యాబ్‌ వాహనాల ఖరీదు ఆధారంగా ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించి చార్జీలను నిర్ధారించింది.  
డి క్లాస్‌ వాహనాల్లో (వాహనం రేటు రూ.5 లక్షల వరకు) కనీస చార్జీ రూ.44 ఉంది. – కిలోమీటరుకు రూ.11– 22
సి క్లాస్‌ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు) వాహనాల్లో అయితే రూ.48.  – కి.మీకి రూ.12–24  
బి క్లాస్‌ (రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు)  వాహనాల్లో రూ.64.   – కి.మీ.కి 16–34  
ఎ క్లాస్‌ (రూ.16 లక్షల పైగా) వాహనాల్లో కనీస చార్జీ రూ.80.   –కి.మీ.కి 25 –45   
కొత్త నిబంధనల ప్రకారం క్యాబ్‌ ట్రాఫిక్‌ లో ఇరుక్కుంటే వెయిటింగ్‌ చార్జీ కింద ప్రతి 15 నిమిషాలకు రూ.10 వసూలు చేస్తారు.

కొన్నింటికే పరిమితం  
అయితే పెంచిన రేట్లు కొన్ని వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా రేట్లు మారుతూ వస్తుంటాయి. ఖరారు చేసిన ధరల కంటే ఒక్కోసారి ఎక్కువగా కూడా వసూలు చేస్తుంటారు. బెంగళూరు టూరిస్టు టాక్సి ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (బీటీటీఓఏ) మాత్రం పెంచిన రేట్లపై స్పందించలేదు. నగరంలో మొత్తంగా 1.25 లక్షల క్యాబ్‌లు, ట్యాక్సీలు రవాణా విభాగానికి అటాచ్‌ అయి ఉన్నాయి. 

మరిన్ని వార్తలు