బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపు

13 May, 2016 00:10 IST|Sakshi
బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపు

వడోదర: యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆగ స్టు 29న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వపు బ్యాంకింగ్ సంస్కరణలకు నిరసనగా ఆగస్ట్‌లో సమ్మె నిర్వహిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన యూఎఫ్‌బీయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపర్చడం, బ్యాంకుల విలీనం, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఎక్కువగా బ్యాంకు లెసైన్స్‌ల జారీ, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోకి అధిక ప్రైవేట్ మూలధనాన్ని అనుమతిం చడం వంటి ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తామని వివరించారు. ప్రభుత్వ సంస్కరణలు కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయన్నారు. బ్యాంకుల మొండిబకాయిల్లో అధిక వాటా కార్పొరేట్ సంస్థలదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎందుకని 7,000 మంది డిఫాల్టర్ల పేర్లను వెల్లడించడం లేదని ప్రశ్నించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు