అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల మోసాలు

3 May, 2018 01:15 IST|Sakshi

23,000 బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులు

 రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: గడిచిన అయిదేళ్లలో 23,000 పైచిలుకు బ్యాంక్‌ మోసాల కేసులు నమోదైనట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. వీటి పరిమాణం మొత్తం రూ. లక్ష కోట్ల పైగా ఉంటుందని పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఫ్రాడ్‌ కేసుల సంఖ్య 5,000 పైచిలుకు ఉండగా, 2017–18లో ఇవి 5,152కి పెరిగాయని సమాచార హక్కు కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ వెల్లడించింది. 2017 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి 1 దాకా వచ్చిన కేసుల్లో అత్యధికంగా రూ. 28,459 కోట్ల మేర మోసాలు నమోదైనట్లు పేర్కొంది.

2016–17లో 5,076 కేసుల్లో ఈ పరిమాణం రూ. 23,933 కోట్లు. ఆయా కేసులపై సత్వరం చర్యలు తీసుకోవడం జరిగిందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ. 13,000 కోట్ల స్కామ్‌ దరిమిలా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మొదలైనవి భారీ కుంభకోణాలపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

>
మరిన్ని వార్తలు