రాత్రి 8 గంటల వరకు బ్యాంకులు

30 Mar, 2018 20:13 IST|Sakshi

ముంబై : పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కోసం బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(మార్చి 31న) బ్యాంకులు రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులతో పాటు అన్ని ఆర్‌బీఐ శాఖల కార్యాలయాలు కూడా రేపు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని పేర్కొంది. అంతేకాక శనివారం అర్ధరాత్రి వరకు డిజిటల్‌ లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది.

రేపటితో ఈ 2017-18 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అంతేగాక ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు రేపే ఆఖరి తేదీ కావడంతో బ్యాంకుల సమయాన్ని పెంచినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కూడా పేర్కొంది. ఇక ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ వంటి ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ సేవలు కూడా శనివారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా ఏప్రిల్‌ 2న బ్యాంకులు సెలవు పాటించనున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది.
 

మరిన్ని వార్తలు