మారిటోయం మరో 3నెలల పొడిగింపు: బేర్‌మన్న బ్యాంకింగ్‌ షేర్లు

22 May, 2020 12:03 IST|Sakshi

ఏడాది కనిష్టాన్ని తాకిన ఎస్‌బీఐ షేరు

అన్ని రకాల టర్మ్‌లోన్లపై మారిటోరియం మరో 3నెలల పాటు పొడిగిస్తున్నట్లు శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ ప్రకటించడంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అనూహ్యంగా అమ్మకాలు నెలకొన్నాయి. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు టర్మ్‌ లోన్లపై మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్‌బీఐ నిర్ణయంతో చాలామందికి ఊరట లభిస్తున్నప్పటికీ.., బ్యాంకులకు రుణాల వసూళ్లు ఆలస్యంతో పాటు డిఫాల్ట్‌ భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. దీంతో బ్యాంకులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బేర్‌మన్న బ్యాంకింగ్‌ రంగ షేర్లు: 

  • ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఇంట్రాడేలో 3శాతం పతనాన్ని చవిచూసింది. 
  • ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ ఏడాది కనిష్టస్థాయి(రూ.149.55)ని తాకింది. 
  • ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీం‍ద్రా బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి 2శాతం పతనాన్ని చవిచూశాయి. 

‘‘కరోనా కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ రెపోరేటును 4.4శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపో రేటును 3.2 శాతానికి తగ్గించింది. దాంతో వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గనున్నాయి. అలాగే, వృద్ధి పుంజుకునే వరకు ద్రవ్య విధానం అనుకూలంగా ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ స్పష్టంగా చెప్పారు. జీడీపీ వృద్ధి సంఖ్యను మాత్రం ఆర్బీఐ దాటవేసింది. ఇది ఆర్థిక వృద్ధిలో సంక్షిష్టతను తెలియజేస్తుంది. టర్మ్‌లోన్ల మారిటోయం మరో 3నెలల పాటు పొడగింపు కొంత ఉపశమనం కలిగించే అంశం. అయితే బ్యాంకింగ్‌ రంగంలో ఒత్తిడి మాత్రం కొనసాగుతుందని’’ జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్‌ తెలిపారు. 
 

మరిన్ని వార్తలు