తెలుగు రాష్ట్రాల్లో బ్యాటరీ అసెంబ్లింగ్‌ యూనిట్లు

16 Jun, 2018 00:35 IST|Sakshi

ముందుకొచ్చిన ట్రైటన్‌–అరిడ హోమ్స్‌

రూ.1,200 కోట్ల వరకు పెట్టుబడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సోలార్‌ సెల్స్, బ్యాటరీల తయారీలో ఉన్న యూఎస్‌ కంపెనీ ట్రైటన్‌ సోలార్‌.. నిర్మాణ రంగంలో ఉన్న అరిడ హోమ్స్‌ భాగస్వామ్యంతో తెలుగు రాష్ట్రాల్లో లిథియం అయాన్‌ బ్యాటరీల అసెంబ్లింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో 2018 సెప్టెంబర్‌కల్లా ప్లాంటు సిద్ధం కానుంది.

అలాగే హైదరాబాద్‌ సమీపంలో డిసెంబర్‌ నాటికి యూనిట్‌ రెడీ అవుతుందని అరిడ హోమ్స్‌ ఎండీ నాగార్జున్‌ జి.వి.రావు తెలిపారు. ట్రైటన్‌ సోలార్‌ ఫౌండర్‌ హిమాన్షు బి పటేల్, అరిడ ప్రతినిధి వెంకట్‌ తదితరులతో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఒక్కో కేంద్రానికి రూ.600 కోట్లకుపైగా వెచ్చిస్తామన్నారు. యూఎస్‌లోని ట్రైటన్‌ తయారీ కేంద్రాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటామని తెలియజేశారు.

పూర్తి తయారీ సైతం...
దేశీయంగా బ్యాటరీలను పూర్తిగా తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించామని నాగార్జున్‌ తెలిపారు. ‘తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో తయారీ కేంద్రం నెలకొల్పాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రభుత్వం తోడ్పాటునిస్తే ఈ ప్లాంటు ద్వారా 1,000 మందికి ఉపాధి లభిస్తుంది.

అసెంబ్లింగ్‌ యూనిట్ల ద్వారా 1,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. భవిష్యత్తులో సోలార్‌ థిన్‌ ఫిల్మ్‌ తయారీని సైతం ఇక్కడ చేపడతాం. ఇందుకు మరో తయారీ కేంద్రం నెలకొల్పుతాం. ఇరు సంస్థలు చెరి సగం పెట్టుబడి పెడతాయి’ అని వివరించారు. 10 మెగావాట్ల సామర్థ్యం వరకు బ్యాటరీలను తయారు చేస్తున్నట్టు హిమాన్షు వెల్లడించారు. ఇవి తక్కువ బరువుతో విద్యుత్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తాయని చెప్పారు.

మరిన్ని వార్తలు