మళ్లీ నిరాశ పరిచిన భారతీ ఎయిర్‌టెల్‌

27 Jul, 2018 00:10 IST|Sakshi

తొలి క్వార్టర్లో 73 శాతం తగ్గిన లాభం

ఆదాయంలోనూ 9 శాతం క్షీణత  

న్యూఢిల్లీ: జియో రంగ ప్రవేశం తర్వాత ఆదాయం, లాభాలను కోల్పోతూ వస్తున్న టెలికం రంగ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ జూన్‌ త్రైమాసికంలోనూ కుదుటపడలేదు. మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ లాభం ఏకంగా 73% తగ్గిపోయి రూ.97 కోట్లకు పరిమితమైంది. ఆదాయం సైతం 9% తగ్గి రూ.20,080 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.367 కోట్లు, ఆదాయం రూ.21,958 కోట్లుగా ఉన్నాయి.

జూన్‌ త్రైమాసికంలో భారత మార్కెట్‌ పరంగా చూస్తే ఆదాయం 7 శాతం తగ్గి రూ.14,930 కోట్లుగా ఉంది. మార్కెట్లో ధరలు ఇప్పటికీ అనుకూలంగా లేవని కంపెనీ ఎండీ సీఈవో గోపాల్‌ విట్టల్‌ తెలిపారు. అయినప్పటికీ బండిల్‌ పథకాలు, కంటెంట్‌ భాగస్వామ్యం, హ్యాండ్‌సెట్‌ అప్‌గ్రేడ్‌ పథకాలతో మొబైల్‌డేటా ట్రాఫిక్‌ అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 355 శాతం పెరిగినట్టు ఆయన చెప్పారు.   

మరిన్ని వార్తలు