మరో 3ఏళ్లలో ఎయిర్‌టెల్‌ షేరు రెండింతలు: జెఫ్పరీస్‌

6 Jun, 2020 09:41 IST|Sakshi

షేరు టార్గెట్‌ ధర రూ.660

భారత్‌ టెలికాం రంగంలో ఆదాయాల వృద్ధితో వచ్చే 3 ఏళ్లలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు రెండింతలు పెరిగే అవకాశం ఉందని జెఫ్పరీస్‌ ఇండియా బ్రోకరేజ్‌ అంచనా వేసింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ సూచీలోని మొత్తం 30 షేర్లలో అన్నింటి కన్నా ఎయిర్‌టెల్‌ షేరు అత్యధికంగా 26శాతం ర్యాలీ చేసి టాప్‌గెయినర్‌గా నిలిచింది.

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ప్రవేశం తర్వాత వైర్‌లెస్‌ క్యారియర్‌లో ప్రథమ స్థానాన్ని కోల్పోయింది. అయినప్పటికీ మొత్తం 30 బ్రోకరేజ్‌ సంస్థల్లో 28 బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడం విశేషం.
 
టెలికాం రంగంలో రెండు కంపెనీల ఆధిపత్యంతో పోటీతత్వం చాలా తక్కువగా ఉంది. దీంతో వచ్చే ఐదేళ్లలో టెలికాం రంగ ఆదాయం రెట్టింపు అయ్యి 38బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. జెఫ్పరీస్‌ బ్రోకరేజ్‌ సంస్థ నిపుణులు అక్షత్‌ అగర్వాల్‌, ప్రతిక్‌ చౌదరీలు నివేదికలో తెలిపారు.

రిలయన్స్‌ జియో 2016 లో టెలికాం రంగంలోకి ప్రవేశించింది. ఉచిత కాల్స్, చౌక డేటా ప్లాన్‌లతో టెలికాం పరిశ్రమను కుదిపేసింది. జియో దెబ్బకు కొన్ని టెలికాం కంపెనీలు విలీనం అయ్యాయి. పోటీకి నిలబడలేక మరికొన్ని కంపెనీలు మూతబడ్డాయి. ఈ కన్సాలిడేట్‌ ప్రభావంతో అంతర్జాతీయ కార్పోరేట్‌ దిగ్గజ కంపెనీలు భారత టెలికాం మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా రిలయన్స్‌ జియో ఫ్లాట్‌ఫామ్‌లో ఫేస్‌బుక్‌ వాటా కొనుగోలుకు ఒప్పందం‍ కుదుర్చుకుంది. ఇటీవల భారతీ ఎయిర్‌టెల్‌లో అమెజాన్‌, వోడాఫోన్‌ ఐడియాలో గూగుల్‌ పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. 

అమెజాన్‌ వాటాల కొనుగోలు వార్తలను ఎయిర్‌టెల్‌ ఖండించింది. వ్యాపార విస్తరణలో భాగంగా అన్ని డిజిటల్‌, ఓటీటీ సంస్థలతో సాధారణ చర్చలు జరుపుతున్నామని కంపెనీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.

వివిధ దేశాలతో పోలిస్తే భారత్‌ స్థూల జాతీయోత్పత్తిలో మొబైల్ ఆదాయ నిష్పత్తి తక్కువగా ఉంది. ఇది టెలికాం కంపెనీల యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ పెరిగేందుకు తోడ్పడుతుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 

డిసెంబర్‌లో టారీఫ్‌లను పెంచినప్పటికీ  మార్చి క్వార్టర్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, జియోలకు 24 మిలియన్ల స్థూల యూజర్లు పెరిగాయి. అంటే టెలికాం మార్కెట్‌ అధిక వ్యయాలను భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుందని బ్రోకరేజ్‌ సూచిస్తుంది. ఈ క్రమంలో జెఫ్పరీస్‌ భారతీ ఎయిర్‌ షేరు ఏడాదికి కాలానికి ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. అలాగే టార్గెట్‌ ధరను రూ.660గా నిర్ణయించింది.

మరిన్ని వార్తలు