ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుభవమే మంచి పాఠం

22 Feb, 2016 02:34 IST|Sakshi

* బ్రోకింగ్ సంస్థల సలహాలకు, మార్కెట్ న్యూస్‌కు ప్రాధాన్యం
* రిలయన్స్ క్యాపిటల్ సర్వేలో వెల్లడి

రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది మార్కెట్ న్యూస్, బ్రోకరేజి సంస్థల నివేదికలు, ఇతరత్రా నమ్మదగిన సమాచారంపై ఆధారపడి పెట్టుబడులు పెడుతున్నట్లు రిలయన్స్ క్యాపిటల్ నిర్వహించిన సర్వే వెల్లడించింది.  రిలయన్స్ క్యాపిటల్ బ్రోకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విభాగం రిలయన్స్ సెక్యూరిటీస్ ఇటీవల తొలిసారిగా రిటైల్ ఇన్వెస్టర్ సర్వేలను నిర్వహించింది. ఇన్వెస్టర్లు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనే అంశాలను వెల్లడించింది.

ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో 25-40 ఏళ్ల వయసున్న సుమారు వెయ్యికి పైగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు సాధారణంగా షేర్ల పనితీరును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు. కానీ ఈ సర్వేలో పాల్గొన్న వారు గతంలో తాము చేసిన పెట్టుబడుల తీరునే పునఃసమీక్షించుకుని, అప్పుడు చేసిన తప్పులను మరలా చేయకుండా ఉండేందుకే ఇష్టత చూపుతున్నారు’ అని వివరిం చారు. టెక్నాలజీ సాయంతో ప్రస్తుత మార్కెట్ విధానాలు సహా గతంలోని మార్కెట్ పరిస్థితుల్ని కూడా తెలుసుకోవడానికి టెక్నాలజీ ఎంతగానో ఉపకరిస్తుందని సర్వేలో ఇన్వెస్టర్లు పేర్కొన్నారు.
 
1. 93% మంది రిటైల్ ఇన్వెస్టర్లు ట్రేడింగ్ నిర్ణయాలను మార్కెట్ న్యూస్ ప్రభావితం చేస్తుందన్నారు.
2. అనుభవమే మంచి సలహాదారని, గత ఇన్వెస్ట్‌మెంట్లనే పరిగణనలోకి తీసుకొని కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తామని 95% మంది పేర్కొన్నారు.
3. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఎంపికలో బ్రోకింగ్ సంస్థలు కీలకమని 80% మంది తెలిపారు.  
4. ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందు వివిధ బ్రోకింగ్ సంస్థల సలహాలను తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తామని 80% మంది తెలిపారు.
5. మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పలు మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సర్వేలో పాల్గొన్న 70% మంది అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు