‘బికినీ’ ఎయిర్‌లైన్స్‌ బంపర్‌ ఆఫర్‌ రూ.9 కే టికెట్‌

21 Aug, 2019 12:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వియత్నాంకు చెందిన వియత్‌ జెట్‌ విమానయాన సంస్థ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన ఈ విమాన సేవలు త్వరలోనే  ప్రారంభం కానున్నాయి. ఇండియా-వియత్నాం మధ్య డిసెంబరు నుంచి ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించనున్నట్లు వియత్‌ జెట్‌ మంగళవారం తెలిపింది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది.  హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని  సంస్థ వెల్లడించింది. 

టికెట్ల ప్రారంభ ధర రూ. 9 
అంతేకాదు మరో బంపర్‌ ఆఫర్‌ కూడా ఉంది.  త్రి గోల్డెన్‌ డేస్‌ పేరుతో స్పెషల్‌ ప్రమోషన్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ. 9 ప్రారంభ ధరతో "సూపర్-సేవింగ్ టిక్కెట్లను" అందిస్తోంది. విస్తరిస్తున్న నెట్‌వర్క్‌లో  భారతదేశం తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా ఉందని వియత్‌జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్‌ తన్ సన్  తెలిపారు. 

కాగా వియత్‌జెట్ డిసెంబర్ 2011 లో పనిచేయడం ప్రారంభించింది.  ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాలలో  సిబ్బంది  బికినీలు ధరించి  ఉంటారు. అంతేకాదు, ఏటా విమానయాన సంస్థ విడుదలచేసే క్యాలెండర్‌లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫొటోలే దర్శనమిస్తాయి.  మరోవైపు చైనాలో జరిగిన ఆసియా కప్‌పోటీలకు వియత్నాం అండర్ -23 ఫుట్‌బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో 'బికినీలు ధరించిన మోడల్స్'  ఉన్న కారణంగా  సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ వియత్నాం (సిఎవి) జనవరి 2018 లో వియత్‌ జెట్‌కు జరిమానా  కూడా విధించింది. 


   

>
మరిన్ని వార్తలు