విరబూసిన వాణిజ్య పద్మాలు

26 Jan, 2015 02:21 IST|Sakshi
విరబూసిన వాణిజ్య పద్మాలు

* అగాఖాన్‌కు పద్మ విభూషణ్
* బిల్-మిలిందా గేట్స్‌లకు పద్మభూషణ్
* పాయ్, నందరాజన్‌లకు పద్మశ్రీ

న్యూఢిల్లీ: వాణిజ్యం, పరిశ్రమల కేటగిరి కింద ముగ్గురు వ్యక్తులకు పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఆయన సతీమణి మిలిందా గేట్స్‌లకు సామాజిక సేవ విభాగంలో పద్మ భూషణ్ అవార్డులు లభించాయి.

ఇక వాణిజ్యం, పరిశ్రమల కేటగిరిలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌ల్లో నివసించే కరీమ్ ఆల్ హుస్సేని అగాఖాన్‌ను పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఇది దేశంలో రెండో అత్యున్నత అవార్డు. ఇన్ఫోసిస్ మాజీ బోర్డ్ సభ్యుడు టి. వి. మోహన్‌దాస్ పాయ్‌కు, ఇండో అమెరికన్ ఆర్థిక వేత్త నంద్‌రాజన్ రాజ్ చెట్టిలకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
 
బిల్‌గేట్స్, మిలిందాగేట్స్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన సంపద 8,200 కోట్ల డాలర్లపైనే. 1995 నుంచి 2014 వరకూ 2-3 ఏళ్లు మినహా ప్రతీ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. తన భార్యతో కలిసి 2000లో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. పేదరికం, ఆరోగ్యం, విద్య రంగాల్లో ఈ ఫౌండేషన్ దాతృత్వ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
 
అగాఖాన్ షియా ఇస్లామ్‌కు సంబంధించిన నిజారి ఇస్లామిజమ్‌కు 49వ ఇమామ్‌గా వ్యహరిస్తున్న ఈయన ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హోటళ్ల వ్యాపారం ప్రధానమైనది. ఎన్నో రేసుగుర్రాలకు అధిపతి. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం ఆయన సంపద 80 కోట్ల డాలర్లు. ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియాల్లో ధార్మిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

 
నందరాజన్ రాజ్ చెట్టి న్యూఢిల్లీలో 1979లో జన్మించిన చెట్టి.. హార్వర్డ్‌లో 2003లో పీహెచ్‌డీ చేశారు. అత్యంత పిన్నవయస్సు(29 సంవత్సరాలు)లోనే హార్వర్డ్ ఎకనామిక్స్‌లో  బోధన చేపట్టి రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం జర్నల్ ఆప్ పబ్లిక్ ఎకనామిక్స్‌కు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

 
టి. వి.మోహన్‌దాస్ పాయ్
1994లో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో చేరిన పాయ్.. సీఎఫ్‌ఓ స్థాయికి ఎదిగారు. ఫైనాన్స్ ఏషియా నుంచి ఉత్తమ సీఎఫ్‌ఓ అవార్డును పొందారు. కామర్స్, న్యాయశాస్త్రాల్లో పట్టభద్రుడైన ఆయన వృత్తిరీత్యా చార్టెర్ట్ అకౌంటెంట్. విద్య, పరిశోధన, మానవ వనరుల్లో మరింతగా కృషి చేయడానికి 2006లో ఇన్ఫీ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం అక్షర ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు.

మరిన్ని వార్తలు