పేటీఎంతో మరింత సులభంగా చెల్లింపులు..

18 Apr, 2020 17:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంటి దగ్గర నుంచే తమ విద్యుత్‌, వాటర్‌, ఇతర బిల్లులను పేటీఎం యాప్‌ ద్వారా సులభంగా చెల్లించవచ్చని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్ తెలిపారు. ‘స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్‌ను పేటీఎం యాప్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్), తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) వంటి అత్యవసరాల బిల్లులను పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.

‘‘బిల్లులను చెల్లించడానికి సంబంధింత వెబ్‌సైట్లకు మారాల్సిన అవసరం లేకుండానే వివిధ సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా ఐకాన్ల నుంచి ఎంపిక చేసుకునే విధంగా రూపొందించాం. వినియోగదారులు తమ మొబైల్‌, డీటీహెచ్‌ రీచార్జ్‌లు, ఎలక్ట్రిసిటీ , క్రెడిట్ కార్డ్ వంటి చెల్లింపులు చేసేందుకు ఈ నూతన యాప్ ఉపయోగపడుతుంది. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునేందుకు ఆప్షన్స్ ఉన్నాయి. బీమా సేవలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక  బై ఇన్సూరెన్స్ ట్యాబ్ ఉంటుందని’’ వివరించారు.

తమ అపార్ట్ మెంట్ మెయింటెనెన్స్ బిల్లును కొద్ది నిమిషాల్లోనే చెల్లించవచ్చన్నారు. సొసైటీ / అపార్ట్ మెంట్ పే టీఎం యాప్ లో నమోదు కాకున్నా కూడా కొన్ని సరళమైన స్టెప్స్ ద్వారా చెల్లింపులు ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. పేటీఎం యాప్‌ ఇంటర్‌ఫేస్‌ను పునరుద్ధరించామని.. తద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలు సులభంగా ఎసెన్సియల్‌ పేమెంట్‌ ఐకాన్‌ను చూడగలుగుతారన్నారు. కరోనాపై సమాచారంతో పాటు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని... దీంతో వివిధ సోషల్ మీడియా వేదికల్లో అవాస్తవ సమాచారం కారణంగా తప్పుదారి పట్టకుండా ఉంటారన్నారు.

వివిధ జాతీయ, ప్రాంతీయ మీడియా పబ్లికేషన్లకు సంబంధించి ఉచిత యాక్సెన్‌ను కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టూల్‌ సాయంతో యూజర్లు ఈ వైరస్‌కు తమ రిస్క్‌ ఫ్యాక్టర్‌ గురించి పరీక్షించుకోవచ్చన్నారు. సురక్షితంగా ఉండేందుకు ముందు జాగ్రత చర్యలు పాటించవచ్చన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పేటీఎం పలు కార్యక్రమాలను ప్రారంభించిందని.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పీఎం కేర్‌ ఫండ్‌ కోసం రూ.500 కోట్లను అందించేందుకు తమ కంపెనీ విరాళాలు సేకరిస్తోందని పేర్కొన్నారు. అదనంగా కూలీలకు ఆహారం అందించేందుకు కూడా విరాళాలు సేకరిస్తున్నామన్నారు. కేవీఎన్‌ ఫౌండేషన్‌ కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు