హైదరాబాద్‌లో క్లెన్‌స్టా ప్లాంట్‌!  

25 Apr, 2019 00:03 IST|Sakshi

వాటర్‌లెస్‌ హెల్త్‌కేర్‌ ఉత్పత్తులకు ఆదరణ

సంస్థ వ్యవస్థాపకుడు పునీత్‌ గుప్తా 

హైదరాబాద్, సాక్షి బిజినెస్‌: వచ్చే ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో తమ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తామని పర్సనల్‌ హెల్త్‌కేర్‌ సంస్థ క్లెన్‌స్టా వ్యవస్థాపకుడు పునీత్‌ గుప్తా చెప్పారు. దాదాపు రూ.35 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తామని, దీని ఉత్పత్తి సామర్ధ్యం రోజుకు రెండు లక్షల బాటిళ్లని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తి చేశామన్నారు. కంపెనీ తాజాగా మార్కెట్లోకి వాటర్‌లెస్‌ బాడీ బాత్, వాటర్‌లెస్‌ షాంపూలను తెచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలరహిత వైయుక్తిక శుభ్రత ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోందని చెప్పారు. రక్షణ, హాస్పిటల్స్, లాంగ్‌టూర్స్‌ చేసేవాళ్లు, అంతరిక్ష ప్రయాణాల్లో వాటర్‌లెస్‌ హెల్త్‌కేర్‌ ఉత్పత్తుల అవసరం చాలా ఉందన్నారు. త్వరలో వాటర్‌లెస్‌ టూత్‌పేస్ట్, మస్కుటో రిపెల్లెంట్‌ను సైతం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నామన్నారు. తమ 100 ఎంఎల్‌ బాటిల్‌తో దాదాపు 350 లీటర్ల నీరు ఆదా అవుతుందన్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ విలువ 11వేల కోట్ల రూపాయలని, ఇందులో మెజార్టీ వాటా సంపాదించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు.  

నీటి ఆదాకు ప్రాధాన్యం 
రాబోయే రోజుల్లో 70 కోట్ల రూపాయల రెవెన్యూ లకి‡్ష్యస్తున్నట్లు తెలిపారు. త్వరలో 30– 70 కోట్ల రూపాయల నిధుల సమీకరణ చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోని ఎయిమ్స్, ఎస్‌కేఎం, యశోదా లాంటి పెద్ద హాస్పిటల్స్‌తో ఒప్పందాలున్నాయని చెప్పారు. ఇటీవలే తమ ఉత్పత్తులను ఇకామ్‌ సైట్లలో విక్రయించేందుకు ఉంచామని, వీటికి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. రన్‌వేల్లో పేరుకుపోయే రబ్బర్‌ను నీటి వినియోగం లేకుండా తొలగించే ద్రావకాన్ని తయారు చేయబోతున్నామని, ఈ విధంగా కేవలం వైయుక్తిక పరిశుభ్రతా ఉత్పత్తుల రంగంలోనే కాకుండా జలసంరక్షణకు వీలున్న అన్ని రంగాల్లో తమ ఉత్పత్తులు తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.    

మరిన్ని వార్తలు