బిట్‌ కాయిన్‌ స్కాం : కోట్ల ఆస్తులు అటాచ్‌

22 Sep, 2018 13:15 IST|Sakshi

న్యూఢిల్లీ : బిట్‌ కాయిన్‌పై ఈ మధ్యన కాస్త మోజు తగ్గింది. బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌లో మోసాలు, కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం, ఆర్‌బీఐ దీన్ని లీగల్‌ కరెన్సీగా గుర్తించకపోవడం దీనికి ప్రధాన కారణమైంది. తాజాగా బిట్‌ కాయిన్‌ లావాదేవీల కేసులో భాగంగా అమిత్‌ భరద్వాజ్‌ అనే వ్యక్తికి సంబంధించి భారీ మొత్తంలో ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. భరద్వాజ్‌కు చెందిన భారత్‌, దుబాయ్‌లో ఉన్న రూ.42.88 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసినట్టు ఈడీ వెల్లడించింది. మనీ లాండరింగ్‌ నివారణ చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆస్తులను అటాచ్‌ చేసుకునే ముందస్తు ఆర్డర్‌ను ఏజెన్సీ జారీ చేసింది. అటాచ్‌ చేసుకున్న ఆస్తుల్లో అమిత్‌ భరద్వాజ్‌కు దుబాయ్‌ ఉన్న ఆరు కార్యాలయాలు, భారత్‌లో ఉన్న బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు, ఫ్లాట్‌లు ఉన్నాయి. వీటి విలువ రూ.42.88 కోట్లగా ఉన్నట్టు ఈడీ పేర్కొంది. భరద్వాజ్‌ సింగపూర్‌లో 2015లో మిస్‌ వేరియబుల్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను సింగపూర్‌లో ప్రారంభించారు. బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ కోసం www.gainbitcoin.comను లాంచ్‌ చేశారు. బిట్‌ కాయిన్‌లు భారత్‌లో చట్టవిరుద్ధం. 

పెట్టుబడుల ద్వారా బిట్‌ కాయిన్లను కొనాలని, ఎక్కువ రిటర్నులు ఆర్జిస్తారని.. భరద్వాజ్‌, ఆయన టీమ్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించారు. అలా 80వేల బిట్‌కాయిన్లతో పెట్టుబడులను సేకరించినట్టు ఈడీ పేర్కొంది. కానీ ఇన్వెస్టర్లకు ప్రమాణం చేసిన మాదిరిగా రిటర్నులను చెల్లించకుండా.. క్రిప్టో కరెన్సీ టోకెన్‌ను ఆఫర్‌ చేసినట్టు తెలిపింది. అయితే దానికి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్‌లో ఎలాంటి విలువ లేదన్నారు. ఇలా పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లు మోసపోయారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈడీ, గెయిన్‌బిట్‌కాయిన్‌ వెబ్‌సైట్‌పై క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేసింది. భరద్వాజ్‌తో మరో ఎనిమిది మందిపై కేసు పెట్టింది. దాదాపు 8000 మంది ఇన్వెస్టర్లు రూ.2000 కోట్ల ఫండ్స్‌ను కోల్పోయారు. మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఈడీ ఈ కేసును దాఖలు చేసింది. పుణే పోలీసులు భరద్వాజ్‌ను, ఆయన సోదరుడు వివేక్‌ను అరెస్ట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు