మార్కెట్లోకి బీఎమ్‌డబ్ల్యూ కొత్త బైక్‌లు 

19 Jul, 2018 01:18 IST|Sakshi

దేశీయంగా తొలిసారి 

సబ్‌500 సీసీ సెగ్మెంట్లోకి ధరల శ్రేణి రూ.2.99 – 3.49 లక్షలు  

న్యూఢిల్లీ: జర్మన్‌ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ... 500 సీసీ లోపుండే భారత బైక్‌ల మార్కెట్లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చింది. బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్‌ సైకిల్‌ విభాగం మోటోరాడ్‌... భారత మార్కెట్‌లో బుధవారం రెండు సబ్‌–500 సీసీ బైక్‌లను విడుదల చేసింది. వీటిలో జీ310ఆర్‌ (ఎక్స్‌ షోరూం) ధర రూ.2.99 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. మెక్సికో, బ్రెజిల్, యూరోప్‌ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ బైక్‌ను ఇండియాలో విడుదల చేయడం ద్వారా కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నట్లు మోటోరాడ్‌ రీజినల్‌ హెడ్‌ డిమిట్రిస్‌ రాప్టిస్‌ చెప్పారు. ఇక డీ130జీఎస్‌ ధర రూ.3.49 లక్షలుగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

బీఎండబ్ల్యూ మోటోరాడ్‌... గతేడాదే భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే ఇప్పటిదాకా 1000సీసీ, అంతకు మించిన సామర్థ్యం ఉన్న బైక్‌లనే విక్రయిస్తోంది. తాజాగా 500 సీసీలోపుండే బైక్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. తాజా రెండు మోడళ్ల విడుదలతో భారత మార్కెట్‌లో బీఎమ్‌డబ్ల్యూ బైక్‌ల పోర్టిఫోలియో 16కు చేరుకుందని రాప్టిస్‌ తెలిపారు. టీవీఎస్‌ హొసూర్‌ ప్లాంట్‌లో ఈ బైక్‌ల ఉత్పత్తి జరుగుతుండగా ఈ సంస్థతో దీర్ఘకాలిక బంధం కొనసాగించడం కోసం పలు పరికరాలను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికే 248 యూనిట్లు భారత్‌లో అమ్ముడయ్యాయని, 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. 

మరిన్ని వార్తలు