హైదరాబాద్ లో బుక్ మై క్యాబ్ సేవలు

12 Nov, 2014 02:13 IST|Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసుల రంగంలో ఉన్న బుక్ మై క్యాబ్.కామ్ హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. భాగ్యనగరికి చెందిన క్యాబ్ ఆన్ క్లిక్.కామ్‌ను కొనుగోలు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. 100 కార్లతో సేవలను ప్రారంభిస్తున్నట్టు బుక్ మై క్యాబ్ సీఈవో అవినాశ్ గుప్త తెలిపారు. సీవోవో వినయ్ పాండేతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.

ముంబై, కోల్‌కత, ఢిల్లీలో 5 వేల వాహనాలతో సర్వీసులు ఇస్తున్నట్టు చెప్పారు. ‘కస్టమర్లు గతంలో ప్రణాళిక ప్రకారం ముందుగా కారు బుక్ చేసేవారు. ఇప్పుడంతా ఇన్‌స్టాంట్. ప్రయాణానికి 15-45 నిముషాల ముందు కారు కావాలంటున్నారు. హైదరాబాద్, కోల్‌కతలో 50 శాతంపైగా కస్టమర్లు ఆన్‌లైన్‌లో క్యాబ్ బుక్ చేస్తున్నారు.

ముంబై, ఢిల్లీలో 65 శాతంపైగా కస్టమర్లు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి క్యాబ్ కోరతారు’ అని వివరించారు. క్యాబ్ డ్రైవర్లు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని వారి పిల్లల చదువుల కోసం దాచుకునేలా సేవింగ్ పథకాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ లేకున్నా ఎస్‌ఎంఎస్ ద్వారా బుకింగ్ సేవలను త్వరలో పరిచయం చేయనుంది.

మరిన్ని వార్తలు