సాక్షి, న్యూఢిల్లీ: ఐరోపా దిగ్గజ గృహోపకరణాల సంస్థ 'బాష్' వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. ఇటీవల ప్రభుత్వం సవరించిన జీఎస్టీ రేట్ల ప్రకారం వివిధ గృహోపకరణాల రేట్లను కూడా సవరించినట్టు ప్రకటించింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సర్ గ్రైండర్ల ధరలను 7-8 శాతం తగ్గించినట్టు వెల్లడించింది. తక్షణమే ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
ప్రభుత్వం ప్రకటించిన పన్ను కోత ప్రయోజనాలను వినియోగదాలరులకే అందించాలనేదే తమ లక్ష్యమని బాష్ ఎండీ, సీఈవో గుంజాన్ శ్రీవాస్తవ తెలిపారు. రానున్న పండుగ సీజన్ సందర్భంగా తమ బ్రాండ్లు బాష్, సిమెన్స్ గృహోపకరణాలపై అందిస్తున్న తగ్గింపు ధరలు తమ ఉత్పత్తులకు మరింత డిమాండ్నుపెంచనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2018 ఆర్థిక సంవత్సరంలో 30-35శాతం వృద్ధిని సాధించిందనీ, ఈ ఏడాది కూడా అదే వృద్ధిని సాధిస్తామనే విశ్వాసాన్ని ప్రకటించారు. కాగా భారత ప్రభుత్వం 15 రకాల వస్తువలపై జీఎస్టీ పన్ను శాతాన్ని 28నుంచి 18కి తగ్గించింది. ఈ నేపథ్యంలో శాంసంగ్, పానాసోనిక్, గోద్రెజ్ లాంటి ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే గృహోపకరణాల ధరల తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.