ఫ్లిప్కార్ట్ కు భారీ ఎదురుదెబ్బ

4 May, 2017 17:34 IST|Sakshi
ఫ్లిప్కార్ట్ కు భారీ ఎదురుదెబ్బ
ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లు కంపెనీలు పడుతున్న పోటాపోటీ మనకు తెలిసిందే. పోటీ తీవ్రతరమవుతున్న క్రమంలో దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలు జరిపే, వైట్ గూడ్స్ తయారీ సంస్థ బీపీఎల్ అమెజాన్ ప్లాట్ ఫామ్ పైకి వెళ్లింది. గురువారం నుంచి అమెజాన్ పై తమ ఉత్పత్తులను ఎక్స్ క్లూజివ్ గా అమ్మనున్నట్టు ఈ కంపెనీ ప్రకటించింది. 1990లో మోస్ట్ పాపులర్ టెలివిజన్ బ్రాండ్స్ లో ఒకటిగా బీపీఎల్  ఉండేది. తర్వాత ఈ కంపెనీ 2006లో ఎలక్ట్రానిక్స్ ను విక్రయించడం ఆపివేసింది. కానీ గతేడాదే ఆ కంపెనీ మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్లిప్ కార్ట్ అతిపెద్ద ఉపకరణాల అమ్మకాల్లో ఈ కంపెనీకి చెందిన ఉత్పత్తులే సుమారు 12 శాతం పైగా ఉన్నాయని బీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అజిత్ నాంబియార్ చెప్పారు. 
 
ఈ ప్లాట్ ఫామ్ పై సుమారు 175 కోట్ల మేర విలువైన ఉత్పత్తులు అమ్మకాలు జరుగుతున్నాయని అంచనాలున్నట్టు తెలిపారు. కానీ ఫ్లిప్ కార్ట్ లో విక్రయాలపై నాంబియార్ అసంతృప్తి వ్యక్తంచేశారు. తమ విక్రయాలు మరింత పెంచుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.  ఈ నేపథ్యంలో కంపెనీ అమెజాన్ ప్లాట్ ఫామ్ కు మరలినట్టు తెలిపారు. అమెజాన్ తో దీర్ఘకాలిక వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యం కోరుకుంటున్నామని నాంబియార్ చెప్పారు.
 
కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు, ఎక్కువగా దేనికోసం సెర్చ్ చేస్తుంటారు వంటి సమాచారాన్ని ఎప్పడికప్పుడూ అమెజాన్ షేరు చేస్తుందని, కొత్త ఉత్పత్తుల లాంచింగ్ లో ఇది ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అమెజాన్ ప్లాట్ ఫామ్ పై ఈ కంపెనీ వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రోవేవ్స్ ను లాంచ్ చేయనుంది. ఈ కంపెనీ టర్నోవర్ గతేడాది 550 కోట్ల రూపాయలుగా ఉంది. మెడికల్ డివైజ్ తయారీలో ఇది అతిపెద్ద వ్యాపారాలను కలిగి ఉంది. ఈ వ్యాపారాలే కంపెనీకి 350 కోట్ల మేర ఉన్నాయి. 
 
మరిన్ని వార్తలు