బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లాభం రూ.294 కోట్లు 

2 May, 2019 00:04 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.15 డివిడెండ్‌  

మొత్తం ఆదాయం రూ.2,861 కోట్లకు  

న్యూఢిల్లీ: బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 12 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.263 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.294 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,582 కోట్ల నుంచి రూ.2,861 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, వరుణ్‌ బెర్రి చెప్పారు. తమ ప్రధాన వ్యాపారం జోరు కొనసాగుతోందని పేర్కొన్నారు.

 డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం, వ్యయ నియంత్రణ పద్ధతులు దీనికి ప్రధాన కారణాలని వివరించారు. పూర్తి ఆహార కంపెనీగా అవతరించడం తమ ప్రధాన లక్ష్యమని, ఈ లక్ష్య సాధన కోసం కొత్త కేటగిరీల్లో ఉత్పత్తులను అందిస్తున్నామని వివరించారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.15 డివిడెండ్‌(1500%)ను ఇవ్వనున్నామని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,004 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధితో రూ.1,155 కోట్లకు పెరిగిందని వరుణ్‌ వెల్లడించారు.  ఆదాయం రూ.10,156 కోట్ల నుంచి రూ.11,261 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు