-
ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు స్వల్ప లాభాలతో సరి
52 పాయింట్ల లాభంతో 37,402కు సెన్సెక్స్
6 పాయింట్లు పెరిగి 11,054 వద్దకు నిఫ్టీ
సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో వరుసగా మూడో రోజూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ఆర్థిక మందగమనం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీల స్థితిగతులపై ఆందోళన కారణంగా ట్రేడింగ్చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాలు పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో 369 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 52 పాయింట్లు లాభపడి 37,402 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 11,054 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 444 పాయింట్లు, నిప్టీ 128 పాయింట్లు చొప్పున పెరిగాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 29 పైసలు పతనమై 71.43కు పడిపోయినా, ముడి చమురు ధరలు 0.56 శాతం పెరిగినా, మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది.
ప్యాకేజీ వచ్చేదాకా...ఒడిదుడుకులు...!
ఆసియా మార్కెట్ల జోష్తో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించగలదన్న అంచనాలతో రోజంతా లాభాలు కొనసాగాయి. చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మధ్యాహ్న లాభాలు చాలా వరకూ ఆవిరయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్369 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్ల మేర పెరిగాయి. అంతర్జాతీయ వాణిజ్యంపై ఆశావహ అంచనాలు, ఐటీ, ఫార్మా షేర్లు కోలుకోవడంతో ఆరంభంలో స్టాక్ సూచీలు మంచి లాభాలు సాధించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మందగమనం సెగ తీవ్రమవుతుండటంతో ఆ లాభాలు ఆవిరయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ప్యాకేజీ ప్రకటన వెలువడేదాకా మార్కెట్లో ఒడిదుడుకులకు కొనసాగుతాయని అంచనా. మందగమన కట్టడికి పలు దేశాల కేంద్ర బ్యాంక్లు ప్యాకేజీలు ప్రకటిస్తాయన్న ఆశలతో ఆసియా, యూరప్ మార్కెట్లు లాభపడ్డాయి.
మళ్లీ మొదటి స్థానంలోకి రిలయన్స్
♦ అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీ మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 1.1 శాతం లాభంతో రూ.1,292కు చేరింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,19,074 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకూ మొదటి స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ (రూ.8,11,747 కోట్ల) కంటే ఇది రూ.7,226 కోట్లు అధికం.
♦ హలోల్ ప్లాంట్కు సంబంధించి అమెరికా ఎఫ్డీఏ నుంచి సానుకూల నివేదిక అందడంతో సన్ఫార్మా షేర్ 2.6 శాతం లాభంతో రూ.426 వద్ద ముగిసింది.
♦ రెప్కో హోమ్ ఫైనాన్స్కు కొనుగోలు రేటింగ్ను బీఎన్పీ పారిబా కొనసాగిం చడంతో ఈ షేర్ 6.3% లాభంతో రూ.330 వద్ద ముగిసింది.
♦ వాటా విక్రయానికి సంబంధించి కోక–కోలాతో మళ్లీ చర్చలు జరిగే అవకాశాలున్నాయన్న వార్తలతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్తో రూ.66 వద్ద ముగిసింది. గత మూడు వారాల్లో ఈ షేర్ 68 శాతం పతనమైంది.