హైహై..వైఫై

20 Aug, 2019 07:53 IST|Sakshi

నగరంలో ఇక ఫ్రీ వైఫై

గూగుల్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం  

25 ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ గూగుల్‌  వైఫై స్టేషన్లు

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటు టెలికం రంగ సంస్ధలకు దీటుగా వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త పంథాతో ముందడుగు వేస్తోంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఎప్పటికప్పుడు పెరుగుతున్న  డిమాండ్‌తోపాటు  ‘హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం వివిధ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. తాజాగా గూగుల్‌ సంస్థతో ఒప్పందం కుదర్చుకొని హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో ఉచిత వైఫై సేవలకు సిద్ధమైంది. అందులో భాగంగా హైదరాబాద్‌ మహా నగరంలో  ఇటీవల సుమారు 25 ప్రాంతాల్లో  బీఎస్‌ఎన్‌ఎల్‌–గూగుల్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ల ద్వారా అన్‌లిమిటెడ్‌ హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. వినియోగదారులు స్టేషన్‌ పరిధిలోకి వచ్చి వైఫై ఓపెన్‌ చేస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ గూగుల్‌ స్టేషన్‌ వైఫై సిగ్నల్‌ వస్తోంది. కనెక్ట్‌ చేస్తే మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తోంది. దానిని ఎంటర్‌ చేస్తే ఓటీపీ  జనరేట్‌  అవుతోంది. దానిని కాపీ చేసి ఎంటర్‌ చేస్తే వైఫ్‌ కనెక్ట్‌ అవుతుంది. వినియోగదారులు ఉచితంగా అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు.

శివార్లలో 125 హాట్‌ స్పాట్లు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు న్న ‘డిజిటల్‌ ఇండియా’లో భాగాంగా గ్రామీణ ప్రాంతాల్లో  వైఫై సేవలు విస్తరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ హైదరాబాద్‌ నగర శివార్లలో  స్వంతంగా 125 హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసింది. హాట్‌ స్పాట్‌ పరిధిలో వైఫై కనెక్ట్‌ అయ్యే వినియోగదారుడు తన మొబైల్‌ కనెక్షన్‌ ద్వారా నెలకు  4 జీబీ  డేటాను ఉచితంగా పొందవచ్చు. ఇప్పటికే ఉచిత వైఫై సేవలు ప్రారంభం కాగా, శివారు ప్రాంతాలైన బండ్లగూడ 96 శాతం, శంకరపల్లి 86.2 శాతం,  పరిగి 84.2 శాతం, షాపూర్‌ 75.7 శాతం వినియోగిస్తున్నట్లు  తెలుస్తోంది. 

>
మరిన్ని వార్తలు