డెబిట్ కార్డు తరహాలో ఉపయోగం
- రూ. 1 లక్ష దాకా నగదు బదిలీ, చెల్లింపులు, విత్డ్రాయల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ శుక్రవారం ‘స్పీడ్ పే’ పేరిట ప్రీపెయిడ్ కార్డు ఆధారిత మొబైల్ వాలెట్ సర్వీసును ప్రారంభించింది. దీంతో రూ. 1 లక్ష దాకా నగదు బదిలీ, చెల్లింపులు, విత్డ్రాయల్ తదితర లావాదేవీలు వీలు కానున్నాయి. కస్టమరుకు బ్యాంకు అకౌంటు లేకపోయినప్పటికీ బీఎస్ఎన్ఎల్ అవుట్లెట్స్ను సందర్శించి.. ‘స్పీడ్ పే వాలెట్’లోకి నగదును లోడ్ (డిపాజిట్) చేసుకుని ఉపయోగించుకోవచ్చు. వాలెట్లోని నగదును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకోవచ్చు.
బ్యాంకు శాఖల్లోనూ లేదా బీఎస్ఎన్ఎల్ అవుట్లెట్స్లోనూ విత్డ్రా చేసుకోవచ్చు. వివిధ సర్వీసుల కోసం చెల్లింపులు జరపవచ్చు. కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ సర్వీసును ప్రారంభించారు. కస్టమరు తన వాలెట్ నుంచి ఇతర బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేసినా లేదా నగదు విత్డ్రా చేసినా 1 శాతం లావాదేవీ చార్జి ఉంటుందని, మిగతా సర్వీసులపై ఎలాంటి చార్జీలు ఉండబోవని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఐటీ కంపెనీ పైరోతో కలిసి ఈ సర్వీసులు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు, సెల్టిక్ సంస్థతో కలిసి బీఎస్ఎన్ఎల్ ‘బజ్’ పేరిట ఎంటర్టైన్మెంట్ సేవలు కూడా ప్రారంభించింది. నెలకు రూ. 10 కట్టడం ద్వారా బీఎస్ఎన్ఎల్ యూజర్లు.. న్యూస్, జోక్స్ మొదలైనవి తమ స్మార్ట్ఫోన్స్లో పొందవచ్చు. తెలుగు, తమిళం తదితర 7 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
ఆంధ్రా బ్యాంకుతో ఒప్పందం..
ఆఫ్లైన్, ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపేందుకు డెబిట్ కార్డు తరహాలో స్పీడ్ పే కార్డు హోల్డరు ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చని పైరో సీఈవో పరితోష్ రెడ్డి తెలిపారు. దీని కోసం ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని 1,000 పైగా బీఎస్ఎన్ఎల్ అవుట్లెట్స్లో టాప్ అప్ సదుపా యం లభిస్తుందని, దీన్ని త్వరలో 45,000 అవుట్లెట్స్కు విస్తరించనున్నట్లు పరితోష్ రెడ్డి చెప్పారు.