పార్లమెంటులో బిజినెస్‌

20 Mar, 2018 01:12 IST|Sakshi

పసిడి దిగుమతి విధానం మారదు
దేశంలో పసిడి దిగుమతి విధానాన్ని సమీక్షించాలన్న ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదు. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి సీఆర్‌ చౌదరి లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. మెటల్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని రత్నాలు, ఆభరణాల పరిశ్రమ నుంచి డిమాండ్లు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ విషయాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. 10 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ, బంగారం దిగుమతులు అధికంగానే ఉంటున్నట్లు తెలిపారు. సుంకాలు తగ్గిస్తే, అది ప్రభుత్వ ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందువల్ల సుంకాల విధాన సమీక్ష ప్రతిపాదనే లేదని అన్నారు.

రక్షణ, నౌక, బొగ్గు రంగాల్లో ఎఫ్‌డీఐల్లేవ్‌...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో రక్షణ, నౌక, బొగ్గు విభాగాలు సహా ఆరు రంగాలు అసలు విదేశీ ప్రత్య్యక్ష పెట్టుబడులనే (ఎఫ్‌డీఐ) ఆకర్షించలేకపోయాయి. మంత్రి సీఆర్‌ చౌదరి లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. ఫొటోగ్రాఫిక్‌ రా ఫిల్మ్‌ అండ్‌ పేపర్, పీచు, రంగుల్లో కలిపే రసాయనాల రంగాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించలేకపోయిన విభాగాల్లో ఉన్నాయి. 

రక్షణ, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్, పౌర విమానయానంసహా పలు రంగాల్లో కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది. 2017–18 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య దేశంలోకి ఎఫ్‌డీఐలు స్వల్పంగా 0.27 శాతం పెరిగాయి. విలువ రూపంలో 35.94 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  

మరిన్ని వార్తలు