కొత్త చట్టం.. ఇక సెలబ్రిటీలకు కష్టమే!

21 Dec, 2017 10:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  వినియోగదారు రక్షణ చట్టం 2017కు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యాడ్ కంపెనీలు చేసే తప్పుడు ప్రచారాల వల్ల మోసపోయే వినియోగదారుల హక్కుల పరిరక్షణకై చట్టానికి సవరణలు చేసిన విషయం తెలిసిందే.

గతంలోనే (ఆగష్టు 2015లో) కేంద్రం లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టింది. తాజాగా కొన్ని సవరణలు తెరపైకి రావటంతో దాని స్థానంలో కొత్త బిల్లును రూపొందించింది. ఈ మేరకు నూతన వినియోగదారుల సంరక్షణ బిల్లు-2017కు ఆమోదం తెలిపింది. తద్వారా వినియోగదారు రక్షణ చట్టం-1986కి 30 ఏళ్ల తర్వాత కొత్తది తీసుకొచ్చినట్లయ్యింది. ఇక వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు.

తాజా చట్టంలో శిక్షలను కూడా చేర్చారు. సెలబ్రిటీలు నటించిది తప్పుడు ప్రకటన అని తేలితే తొలిసారి 10 లక్షల రూపాయల ఫైన్‌తో, మరియు ఏడాదిపాటు ఎలాంటి ఎండోర్స్‌మెంట్‌ చేయకుండా నిషేధిస్తారు. రెండోసారి కూడా అదే పని చేస్తే.. 50 లక్షల రూపాయల ఫైన్‌.. మూడేళ్ల బ్యాన్‌ పడుతుంది. ఇక కంపెనీలకు కూడా శిక్షలు ఉన్నాయి. మొదటిసారికి గానూ 10 లక్షల రూపాయల ఫైన్‌.. రెండేళ్ల జైలు శిక్ష. రెండోసారస్కి 50 లక్షల ఫైన్‌తోపాటు ఐదేళ్ల శిక్ష విధిస్తారు. వీటితోపాటు నష్టపరిహారం అంశాన్ని ఆయా కేసుల తీవ్రతను బట్టి పరిశీలిస్తారు.

జనాల్లో సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్‌ను వాడుకుని పలు సంస్థలు యాడ్‌లు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తద్వారా వారు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒకానోక సమయంలో ఫ్రోఫెషనల్‌గా కంటే ఇలా ఎండోర్స్‌మెంట్లతోనే వారికి వచ్చే ఆదాయం ఎక్కువ. అయితే ప్రజలను మభ్యపెట్టే తప్పుడు ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించడం సరికాదన్న వాదన గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజా చట్టంతో దానికి బ్రేక్‌ పడనుంది. 

మరిన్ని వార్తలు