వచ్చే క్వార్టర్‌కల్లా మెరుగుపడతాం 

18 May, 2019 00:10 IST|Sakshi

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆశాభావం

న్యూఢిల్లీ: నిధుల లభ్యతపరంగా ప్రస్తుతం తీవ్ర ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సెప్టెంబర్‌ త్రైమాసికానికల్లా పరిస్థితులు మెరుగుపడగలవని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆశిస్తోంది. లిక్విడిటీ(ద్రవ్య లభ్యత) సమస్యల నుంచి బైటపడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని సంస్థ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) ఎస్‌కే గుప్తా వెల్లడించారు. వివిధ సర్కిల్స్‌లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్స్‌ (సీజీఎం)కు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు.

టారిఫ్‌ల పరమైన పోరుతో టెలికం రంగంలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర పోటీ నెలకొందని గుప్తా చెప్పారు. ‘లిక్విడిటీ ఒత్తిళ్లను అధిగమించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ మేనేజ్‌మెంట్‌ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. సమీప భవిష్యత్‌లో కంపెనీ పరిస్థితి మెరుగుపడగలదని అంచనా వేస్తున్నాం’ అని మే 16న రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థల కారణంగా ఆదాయానికి గండిపడుతున్నా.. కస్టమర్‌ బేస్‌ను కాపాడుకోగలుగుతున్నామని గుప్తా వివరించారు.
 

మరిన్ని వార్తలు