బీవోఐ అధికారులు ఇద్దరు అరెస్ట్‌

7 Jul, 2018 01:28 IST|Sakshi

డైమండ్‌ పవర్‌కి రుణాల వివాదంలో అదుపులోకి తీసుకున్న సీబీఐ

న్యూఢిల్లీ: డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐఎల్‌)కి రూ. 2,654 కోట్ల రుణాల కుంభకోణంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ)కి చెందిన ఇద్దరు సీనియర్‌ రిటైర్డ్‌ అధికారులను సీబీఐ శుక్రవారం అరెస్ట్‌ చేసింది. బీవోఐ వదోదర శాఖలో రిటైరయిన జీఎం వీవీ అగ్నిహోత్రి, డీజీఎం పి.కె. శ్రీవాస్తవ వీరిలో ఉన్నారు. రుణ పరిమితులను పెంచడంలో కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారంటూ వీరిపై అభియోగాలు ఉన్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

ఈ ఇద్దరిని అహ్మదాబాద్‌లోని స్పెషల్‌ కోర్టులో శనివారం హాజరుపర్చనున్నట్లు వివరించాయి. డీపీఐఎల్‌ ప్రమోటర్లు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగానికి చెందిన 11 బ్యాంకుల కన్సార్షియం  2008 నుంచి డీపీఐఎల్‌ మోసపూరితంగా రుణాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా 2016 జూన్‌ 29 నాటికి కంపెనీ మొత్తం రూ. 2,654 కోట్ల మేర బాకీపడింది. 2016–17లో ఈ మొత్తాన్ని బ్యాంకులు మొండిబాకీగా వర్గీకరించాయి. 

మరిన్ని వార్తలు