చందా కొచ్చర్‌ను మరోసారి ప్రశ్నించనున్న ఈడీ

7 Jun, 2019 12:43 IST|Sakshi

ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్‌ - వీడియోకాన్‌ మనీల్యాండరింగ్‌ కేసులో విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విస్తృతం చేయనుంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌తో పాటు బ్యాంకు ఉన్నతాధికారులను మరోసారి ప్రశ్నించనున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో చందా కొచ్చర్‌ ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లను గతనెలలో ప్రశ్నించిన ఈడీ వారి స్టేట్‌మెంట్‌లను నమోదు చేసింది.

చందా కొచ్చర్‌ ఇచ్చిన సమాధానాలను ఇతర అధికారులను ప్రశ్నించి వారి సమాధానాలతో సరిపోల్చేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో వీడియోకాన్‌ డీల్‌ గురించి పూర్తి సమాచారం రాబట్టేందుకు ఈడీ కసరత్తు ముమ్మరం చేసింది. కాగా, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కొన్ని వ్యక్తిగత కారణాలతో తనకు కొంత సమయం కావాలని కోరిన చందా కొచ్చర్‌ త్వరలోనే ఈడీ ఎదుట హాజరుకానున్నారు.

కాగా,ఈ కేసుకు సంబంధించి మనీల్యాండరింగ్‌ చట్టం కింద చందా కొచ్చర్‌ ఆమె మరిది రాజీవ్‌ కొచ్చర్‌ల ఆస్తులను అటాచ్‌ చేసేందుకు ఈడీ యోచిస్తోంది.  ఐసీఐసీఐ బ్యాంక్‌ వీడియోకాన్‌కు రుణాలు జారీ చేసే క్రమంలో పెద్దమొత్తంలో బ్యాంక్‌ చీఫ్‌ చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు ముడుపులు ముట్టాయని, అనుచిత లబ్ధిపొందారనే అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు