వారాంతంలో మోదీ ఆర్థిక సమీక్ష
కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న రూపాయి
కలసివచ్చిన వేల్యూ బయింగ్
305 పాయింట్ల లాభంతో 37,718కు సెన్సెక్స్
82 పాయింట్లు పెరిగి 11,370కు నిఫ్టీ
రూపాయి రికవరీతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. గత రెండు రోజుల భారీ పతనం కారణంగా ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న ఎఫ్ఎమ్సీజీ, లోహ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు (వేల్యూ బయింగ్) జరిగాయి. రూపాయి పతనం, ఇతర ఆర్థికాంశాలపై ఈ వారాంతంలో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారని, కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోనున్నారన్న వార్తలూ సానుకూల ప్రభావం చూపించాయి. ముడి చమురు ధరలు దిగిరావడం కూడా కలసివచ్చింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ మళ్లీ కీలకమైన 11,350 పాయింట్లపైకి ఎగబాకింది. బీఎస్ఈ సెన్సెక్స్ 305 పాయింట్ల లాభంతో 37,718 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,370 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీసీ, హెచ్యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ర్యాలీ జరపడం సెంటిమెంట్కు జోష్నిచ్చింది. 410 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్..: సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైనప్పటికీ, ఆ తర్వాత తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. మొత్తం మీద రోజంతా 410 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 37 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 93 పాయింట్లు పెరిగింది.
నేడు మార్కెట్కు సెలవు..
వినాయక చతుర్థి సందర్భంగా నేడు(గురువారం) స్టాక్ మార్కెట్తో పాటు అన్ని మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతో పాటు ఫారెక్స్, మనీ, బులియన్, ఆయిల్, ఆయిల్ సీడ్స్ మార్కెట్లు పనిచేయవు.