చెక్‌బుక్‌లపై ఎస్‌బీఐ మరో ప్రకటన

20 Mar, 2018 17:33 IST|Sakshi
స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) చెక్‌బుక్‌లపై మరో ప్రకటన చేసింది. మార్చి 31 వరకు కొత్త చెక్‌బుక్‌లను దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. గతేడాది ఎస్‌బీఐ తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు, భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను విలీనం చేసుకున్న బ్యాంకుల కస్టమర్లను కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలని ఆదేశించింది. పాత చెక్‌బుక్‌లు చెల్లవని తెలిపింది. దీని కోసం తొలుత సెప్టెంబర్‌ 30 వరకు గడువిచ్చింది. అనంతరం ఆ గడువును 2017 డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. ప్రస్తుతం విలీన బ్యాంకుల కస్టమర్లు కొత్త చెక్‌బుక్‌లను దరఖాస్తు చేసుకోవడానికి 2018 మార్చి 31 వరకు సమయమిస్తున్నట్టు తెలిపింది. అప్పటి వరకు పాత చెక్‌బుక్‌లు చెల్లుతాయని చెప్పింది. 2018 మార్చి 31 అనంతరం  నుంచి మాత్రం పాత చెక్‌ బుక్‌లు చెల్లవని తన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో వెల్లడించింది.

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ లేదా ఏటీఎంలు, ఎస్‌బీఐ బ్రాంచులను ఆశ్రయించి, కొత్త చెక్‌బుక్‌లను కస్టమర్లు దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. ఇప్పుడే కొత్త చెక్‌బుక్‌ కోసం దరఖాస్తు చేసుకుని, అసౌకర్యాన్ని నివారించుకోండి అని చెప్పింది. గతేడాది ఎస్‌బీఐ, భారతీయ మహిళా బ్యాంక్‌తో సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్-జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్‌ను తనలో విలీనం చేసుకున్న సంగతి తెలిసందే. ఈ విలీనంతో గ్లోబల్‌గా టాప్‌-50 బ్యాంకుల్లో ఒకటిగా ఎస్‌బీఐ నిలిచింది. విలీనం తర్వాత 1300 బ్రాంచుల పేర్లను, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను కూడా ఎస్‌బీఐ మార్చేసింది. 

>
మరిన్ని వార్తలు