ఒకేసారి రెండు టెలికాం దిగ్గజాలకు షాక్‌!

23 Jul, 2018 13:08 IST|Sakshi
రిలయన్స్‌ జియో - భారతీ ఎయిర్‌టెల్‌

ముంబై : టెలికాం మార్కెట్‌లోకి పోటాపోటీగా తలపడుతున్న రెండు దిగ్గజాలు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లకు షాక్‌ తగిలింది. ఈ రెండు కంపెనీల చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు ఒకేసారి ఆయా కంపెనీలకు రాజీనామా చేశారు. రిలయన్స్‌ జియో గ్రూప్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జగ్బీర్‌ సింగ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెట్‌వర్క్స్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ శ్యాం ప్రభాకర్‌ మార్దికార్‌లు కంపెనీలకు రాజీనామా పత్రాలు అందించినట్టు తెలిసింది. 

రిలయన్స్‌ జియోకు చెందిన జగ్బీర్‌ సింగ్‌, కంపెనీ తన 4జీ సర్వీసులు లాంచ్‌ చేయకముందు నుంచి దానిలో పనిచేస్తున్నారు. అంతకముందు శాంసంగ్‌లో పనిచేశారు. ఓ దశాబ్ద కాలం పాటు ఎయిర్‌టెల్‌ కూడా పనిచేసినట్టు తెలిసింది. జగ్బీర్‌ ప్రస్తుతం ఢిల్లీ వెళ్తున్నారని, అందుకే రాజీనామా చేశారని వెల్లడైంది. మిగతా ఏ వివరాలను కూడా కంపెనీ వర్గాలు వెల్లడించలేదు. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌కు శ్యాం రాజీనామా చేసినట్టు ఈ కంపెనీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. 

బంధిత వర్గాల వివరాల ప్రకారం మార్దికార్‌, తన కెరీర్‌లో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి రాజీనామా చేసినట్టు తెలిసింది. 2012 నుంచి మార్దికార్‌, ఎయిర్‌టెల్‌లో పనిచేస్తున్నారు. 2001-2010 మధ్యలో కూడా ఎయిర్‌టెల్‌లో ఈయన పనిచేశారు. ఆ అనంతరం ఉద్యోగం వదిలేశారు. మళ్లీ 2012 ఆగస్టులో అదే కంపెనీలో చేరారు. 2017 జనవరి నుంచి ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెట్‌వర్క్స్‌కు సీటీఓగా కూడా ఉన్నారు. 

మరిన్ని వార్తలు