భారీగా సంపద కోల్పోయిన ఆపిల్‌, టెస్లా సప్లయర్‌

22 Oct, 2018 13:13 IST|Sakshi

6.6 బిలియన్‌ డాలర్లు కోల్పోయిన చైనీస్‌ మహిళ

బీజింగ్‌ : అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో చైనా బిలీయనీర్లు భారీగా సంపద కోల్పోతున్నారు. ఇప్పటికే అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా, టెన్సెంట్‌ హెల్డింగ్స్‌ సీఈఓ మా హుటేంగ్‌ బిలియన్‌ డాలర్లను కోల్పోగా.. లెన్స్‌ టెక్నాలజీ సహ వ్యవస్థాపకురాలు జో కున్‌ఫెయ్‌ కూడా తాజాగా ఈ జాబితాలో చేరారు. చైనాలో అత్యంత ధనవంతురాలైన మహిళగా గుర్తింపు పొందిన జో కున్‌ఫెయ్‌ 6.6 బిలియన్‌ డాలర్ల(660 కోట్ల రూపాయలు) సంపద కోల్పోయారని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది. ఈ గణాంకాలు ఆమె మొత్తం సంపదలో 66 శాతం అని పేర్కొంది. సంపద కోల్పోతున్న చైనీయుల్లో ఆమె ప్రథమ స్థానంలో ఉన్నారని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

కాగా చైనాలోని హనన్‌ ప్రావిన్స్‌లో గల జియాంగ్‌ జియాంగ్‌ పట్టణంలో 1970లో జన్మించిన జో మొదట ఓ గ్లాస్‌ తయారీ కంపెనీలో పనిచేశారు. తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలి లెన్స్‌ టెక్నాలజీని స్థాపించారు. 2015లో వ్యాపార కలాపాలు మొదలుపెట్టిన ఈ సంస్థ ఆపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లకు టచ్‌స్క్రీన్లను అందిస్తోంది. అదే విధంగా‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టెస్లాకు అవసరమైన డిస్‌ప్లే ప్యానెళ్లను తయారుచేసి ఇచ్చేది. అయితే గత కొం‍త కాలంగా అమెరికా- చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్‌వార్‌ ముదురుతున్నకారణంగా లెన్స్‌ టెక్నాలజీ ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ప్రధాన కస్టమర్లైన రెండు కంపెనీలు అమెరికాకే చెందినవి కావడంతో జో భారీగా సంపద కోల్పోయారు. (చదవండి : చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్‌)

మరిన్ని వార్తలు