సిప్లా చేతికి దక్షిణాఫ్రికా ఫార్మా కంపెనీ

13 Jul, 2018 00:35 IST|Sakshi

డీల్‌ విలువ రూ.228 కోట్లు

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా కంపెనీ దక్షిణాఫ్రికాకు చెందిన మిర్రెన్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నది. ఓవర్‌ ద కౌంటర్‌ (ఓటీసీ) ఔషధాలను తయారు చేసే మిర్రెన్‌ కంపెనీని రూ.228 కోట్లకు (45 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్‌లు) కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని సిప్లా తెలిపింది. మిర్రెన్‌ లిమిటెడ్‌ను తమ దక్షిణాఫ్రికా అనుబంధ కంపెనీ, సిప్లా మెడ్‌ప్రో సౌత్‌ ఆఫ్రికా కొనుగోలు చేయనున్నదని వివరించింది.

ఈ లావాదేవీకి దక్షిణాఫ్రికా కాంపిటీషన్‌ కమిషన్‌ ఆమోదం పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా ఈ డీల్‌ పూర్తవుతుందని పేర్కొంది. దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే మిర్రెన్‌ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగిసే ఏడాదికి 15.21 కోట్లదక్షిణాఫ్రికా రాండ్‌ల టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ కొనుగోలు వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో సిప్లా షేర్‌ 1.2 శాతం లాభంతో రూ.632 వద్ద ముగిసింది.  
 

మరిన్ని వార్తలు