ఫైనాన్షియల్ మార్కెట్లను దగ్గరగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడి
చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన
ముంబై: శుక్రవారం దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన నేపథ్యంలో ఫైనాన్షియల్ మార్కెట్లను అతి దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించాయి. సెన్సెక్స్ ఒక్కసారిగా 1,127 పాయింట్లను కోల్పోయిన అంశంపై పర్యవేక్షణ చేస్తున్నామని, ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు విడివిడిగా ప్రకటించాయి.
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) దేశీ మార్కెట్లో పెట్టే పెట్టుబడులకు సంబంధించిన కేవైసీ నిబంధనలను సవరించినట్లు సెబీ వెల్లడించింది.మౌలిక వసతుల కల్పన సంస్థ ఐఎల్అండ్ఎఫ్ఎస్ రుణాల చెల్లింపుల పరంగా విఫలమైనట్లు వెల్లడికావడం, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు సంబంధించి ఆందోళనలు వ్యక్తం కావడం లాంటి పలు ప్రతికూల అంశాల కారణంగా శుక్రవారం మార్కెట్లు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి మళ్ళిన విషయం తెలిసిందే.