భారత్‌లో రెండు ప్లాంట్ల మూసివేత: ఫైజర్‌ 

10 Jan, 2019 01:21 IST|Sakshi

ముంబై: అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌.. భారత్‌లో రెండు ప్లాంట్లను మూసివేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమిళనాడులోని ఇరుంగట్టుకొట్టాయ్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని తయారీ ప్లాంట్లను మూసివేయాలని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. వీటిల్లో తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్‌ గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణమని వివరించింది. ప్లాంట్ల మూసివేతతో దాదాపు 1,700 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.

ప్రస్తుతం ఇరుంగట్టుకొట్టాయ్‌ యూనిట్‌లో 1,000 మంది సిబ్బంది, ఔరంగాబాద్‌ ప్లాంట్‌లో 700 మంది సిబ్బంది ఉన్నారు. 2015లో అమెరికాకే చెందిన మరో సంస్థ హోస్పిరాను కొనుగోలు చేయడంతో ఈ రెండు ప్లాంట్లూ ఫైజర్‌కు దఖలుపడ్డాయి. ఫైజర్‌కు భారత్‌లో వైజాగ్‌తో పాటు మొత్తం అయిదు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. గోవా, వైజాగ్, గుజరాత్‌ ప్లాంట్ల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగుతాయని ఫైజర్‌ వివరించింది.   

మరిన్ని వార్తలు