2 నెలల్లో 200 మంది నియామకం!

10 Aug, 2018 01:38 IST|Sakshi

ఏడాదిలో మార్గ్‌ ఈఆర్పీ నుంచి  క్లౌడ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇన్వెంటరీ, అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మార్గ్‌ ఈఆర్పీ వచ్చే రెండు నెలల్లో 200 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లకి‡్ష్యంచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్తగా పది మంది ఉద్యోగులొస్తారని మార్గ్‌ ఈఆర్పీ నేషనల్‌ హెడ్‌ ప్రితేష్‌ ప్రభాకర్‌ పాటిల్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో మార్గ్‌ ఈఆర్పీకి 650 మంది ఉద్యోగులున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లో కార్యాలయం ఉందని... ఈ ఏడాది చివరి నాటికి విజయవాడలో ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. ‘‘జీఎస్‌టీ కంటే ముందు దేశంలో 9 లక్షల మంది కస్టమర్లుండేవారు. జీఎస్‌టీ తర్వాత 2 లక్షల మంది అదనంగా జతయ్యారు. జీఎస్‌టీ కంటే ముందు తెలంగాణ, ఏపీల్లో 16 వేలుగా ఉన్న కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 24 వేలను దాటింది. ఏడాదిలో ఈ సంఖ్యను 48 వేలకు చేర్చాలని లకి‡్ష్యంచాం’’ అని ఆయన వివరించారు. దేశంలో ఏటా 12 వేల అకౌంటింగ్‌ లైసెన్స్‌లను విక్రయిస్తున్నామని.. ఇందులో 450–500 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని చెప్పారు. ఒక్క లైసెన్స్‌ రూ.7,200–25,000 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. 

ఏడాదిలో క్లౌడ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌.. 
ప్రస్తుతం క్లౌడ్‌ ఆధారిత అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిపై పరిశోదన చేస్తున్నామని.. ఏడాదిలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని పాటిల్‌ చెప్పారు. మొబైల్, ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్‌ ఏ ఎలక్ట్రానిక్‌ ఉపకరణంలోనైనా వినియోగించుకునే వీలుండటమే దీని ప్రత్యేకత అని చెప్పారు. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.125 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశామని, ఇందులో రూ.6.5 కోట్లు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుందని తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.180 కోట్లు లకి‡్ష్యంచామని తెలిపారు.   

>
మరిన్ని వార్తలు